మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 11: జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభానికి వస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ని అడ్డుకుంటారనే అపోహతో అక్రమంగా అరెస్టు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గం కోఆర్డినేటర్ కాటి బోయిన నాగేశ్వరరావు గురువారం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చినప్పుడల్లా అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రధానంగా భద్రాచలం రాములవారికి ఇచ్చిన వాగ్దానం 100 కోట్లు ఇవ్వాలని, గోదావరి వరద నివారణకు ప్రకటించిన 1000 కోట్లు విడుదల చేయాలన్నారు. నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు, దళితులందరికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
