నగల చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
– చాకచక్యంతో కేసును చేదించిన పోలీసులు
– చోరీలో పోయిన నగలు రికవరీ
మన్యం న్యూస్, సారపాక :
ఇటీవల సారపాక పంచాయతీ గాంధీనగర్ కాలనీలో పదముత్యం రఘుబాబు అనే వ్యక్తి ఇంటిలో సుమారు 9 తులాల బంగారు నగలు, కొన్ని వెండి నగలు చోరీకి గురైన విషయం విధితమే. అయితే ఈ చోరీ కేసును అత్యంత చాకచక్యంతో బూర్గంపాడు పోలీసులు త్వరితగతిన ఛేదించారు. చోరీకి పాల్పడిన వ్యక్తి వద్దనుండి నగలను రికవరీ చేశారు. శుక్రవారం బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాల్వంచ సీఐ నాగరాజు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఈనెల 4వ తారీఖున సారపాక పంచాయతీ గాంధీనగర్ కాలనీలోనే పదముత్యం రఘుబాబు అనే వ్యక్తి ఇంటిలో భద్రాచలం పట్టణానికి చెందిన రాజమండ్రి రాజేష్ అనే వ్యక్తి ఎవరూ లేని సమయం చూసి బీరువాలోని బంగారు వెండి నగల చోరీకి పాల్పడ్డాడని తెలిపారు. ఈ రాజమండ్రి రాజేష్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తుంటాడని, ఇతడి పై గతంలో ఏడు దొంగతనం కేసులలో అరెస్ట్ అయ్యే శిక్ష అనుభవించాడని జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్లీ దొంగతనాలు మొదలు పెట్టాడని సీఐ వెల్లడించారు. పట్టుబడిన దొంగ వద్ద నుండి సుమారు 9 తులాల బంగారు నగలు, సుమారు 10 తులాల వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనం జరిగిన నాటినుండి బూర్గంపాడు ఎస్ఐ సంతోష్, ఎస్సై రమణారెడ్డి అత్యంత చాకచక్యంగా విచారణ జరిపించి దొంగతనం జరిగిన తొమ్మిది రోజుల్లోనే కేసును చేదించడం పట్ల స్థానిక ప్రజల నుండి ప్రశంసలు వెలువవుతున్నాయి. కేసును చేదించేందుకు కృషిచేసిన ఎస్ఐ పి.సంతోష్, అదనపు ఎస్ఐ రమణారెడ్డి, కానిస్టేబుల్ రామకృష్ణ, ఇతర పోలీస్ సిబ్బందిని, క్లూస్ టీం సభ్యులను సిఐ అభినందించారు. ఈ సమావేశంలో బూర్గంపాడు ఎస్ఐ పి.సంతోష్, అదనపు ఎస్ఐ రమణారెడ్డి, ఏఎస్ఐ వై.వి.వి.సత్యనారాయణ, కానిస్టేబుల్ రామకృష్ణ, క్లూస్ టీం సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.