మన్యం న్యూస్, పినపాక, జనవరి 13
మండలంలో వివిధ పాఠశాలల్లో సంక్రాంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వేషధారణలు, భోగి మంటలు, రంగు రంగుల ముగ్గులు, ఆకట్టుకున్నాయి. మండల పరిధిలోని ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో గల రాధిక హై స్కూల్ లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేకంగా రంగు రంగుల ముగ్గులు వేశారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులచే ముగ్గుల పోటీలు నిర్వహించి, ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలలో విద్యార్థుల సాంప్రదాయ వస్త్రధారణలతో పాఠశాల ఆవరణ పండగ వాతావరణం నెలకొంది. విద్యార్థినులు రంగవల్లుల పోటీలు, గాలిపటాలు ఎగరవేయడం, ఫుడ్ ఫెస్టివల్ తదితర పోటీలు నిర్వహించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీవిద్య జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నిరోషా, వైస్ ప్రిన్సిపల్ రవి ప్రసాద్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
