అటవీశాఖ నిరంకుశ దాడులు హేమమైన చర్య
-వరద ముంపు బాధితులను అన్ని విధాల ఆదుకోవాలి.
-పౌర హక్కుల సంఘం (సి ఎల్ సి) నిజ నిర్ధారణ బృందం.
మన్యం బూర్గంపాడు జనవరి 17: మండలంలోని మణుగూరు కొత్తగూడెం జాతీయ రహదారికి పక్కన గత కొంతకాలంగా గోదావరి వరద ముంపు బాధితులను ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాల ఆదుకోవాలని పౌర హక్కుల సంఘం నిజ నిర్ధారణ బృందం కోరింది.
ఈ మేరకు మంగళవారం రోజున గత ఐదు నెలలుగా దీక్షలు నిర్వహిస్తున్న భద్రాచలం క్రాస్ రోడ్డు సమీప నిర్వాసిత గుడిసె వాసులను పౌర హక్కుల సంఘం నాయకుల బృందం సందర్శించింది. నిర్వాసితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రవికుమార్, జిల్లా అధ్యక్షులు ఎస్ ఉపేందర్ రావు, కార్యదర్శి కే శ్రీనివాసులు మాట్లాడుతూ నిర్వాసితుల్లోని ఆదివాసీలకు ఎటువంటి షరతులు లేకుండా పక్క భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సందర్శించి నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్స్ నిర్మిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని వారు కోరారు. అంతేకాకుండా దళితులు మైనార్టీ బిసి పేదలందరికీ ప్రాథమిక అవసరాలు, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వ మీద ఉంటుందన్నారు. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాసితులపై ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు నిరంకుశంగా దాడులకు పాల్పడటం హేయమైన చర్యగా పరిగణిస్తున్నట్లు సి ఎల్ సి నాయకులు పేర్కొన్నారు. తాము ఈ నిజ నిర్ధారణ ద్వారా వచ్చిన అంశాలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రవికుమార్, జిల్లా అధ్యక్షులు ఎస్ ఉపేందర్ రావు, కార్యదర్శి కే శ్రీనివాస్ నాయకులు దుర్గారెడ్డి, రమణ, మోహన్, సాగర్, మురళి తదితరులు పాల్గొన్నారు.