అంధత్వ నివారణకు మహోత్తర కార్యక్రమం
నేటి నుంచి కంటి వెలుగు ప్రారంభం
కంటి వెలుగు నిర్వహణపై వివిధ శాఖ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 18… అంతత్వ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కంటి వెలుగు కార్యక్రమం మహోత్తరమైనదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ పిలుపునిచ్చారు బుధవారం కంటి వెలుగు కార్యక్రమం పై అధికారులతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, యంపిడిఓలు, యంపిఓలు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. జిల్లాలోని 481 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాల్టీల పరిధిలో కంటివెలుగు కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం గ్రామ పంచాయతి, మున్సిపాల్టీలలో కంటివెలుగు క్యాంపులు నిర్వహించాలని చెప్పారు. కంటి వెలుగు కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు 48 టీములు ఏర్పాటు చేశామని, 19వ తేదీ ఉదయం 9 గంటలకు అన్ని కేంద్రాలలో ఈ ఉచిత కంటివెలుగు శిభిరాలు ప్రారంభం కావాలని ఆయన పేర్కొన్నారు. మనిషికి కంటి చూపు అత్యంత ప్రధానమైదని కంటిచూపు పునరుద్ధరణకు చేపట్టిన ఈ మహోత్తర కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రశంసలు పొందే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అన్ని కేంద్రాలకు కంటిపరీక్షలు నిర్వహించు సిబ్బందితో పాటు మెటీరియల్ సరఫరా జరిగిందని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని . టీములు ఉదయం 8.30 గంటలకు క్యాంపులకు చేరుకుని 9 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభించాలని, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు కంటివెలుగు కార్యక్రమాన్ని తెలియచేసి కంటిపరీక్షలు నిర్వహించుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. క్యాంపులు నిర్వహణ తీరు పర్యవేక్షణకు
ప్రత్యేకంగా టీములు ఏర్పాటు చేయడం జరిగిందని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రీడింగ్ సమస్య ఉన్న వారికి పరీక్ష తదుపరి తక్షణమే కంటి అద్దాలు అందచేయాలని, ఇతర సమస్యలున్న వారి వివరాలు ఆన్లైన్ లో నమోదు ఆధారంగా 10 రోజుల్లో కంటి అద్దాలు అందచేయనున్నట్లు తెలిపారు. క్యాంపునకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా ఆధార్ కార్డు వెంటతెచ్చుకోవాలని, ఆధార్ ఆధారంగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కంటి వెలుగు సిబ్బంది ప్రారంభపు రోజంతటి ఉత్సాహంతో మిగిలిన 100 రోజులు పనిచేయాలని చెప్పారు. కంటి వెలుగు క్యాంపుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ, మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు. క్యాంపులో మంచినీరు, కుర్చీలు, షామియనాలు వంటి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వివిధ కారణాల వల్ల ప్రజలు కంటి సమస్యను సకాలంలో గుర్తించక అంధత్వ బారిన పడుతున్నారని, కంటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ఈ మహోత్తర కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని, కంటి సమస్యల నుండి పరిపూర్ణ కంటిచూపును పొందాలని ఆయన పేర్కొన్నారు. సుదూరంగా ఉన్న గ్రామాల ప్రజలు కంటి వెలుగులో కంటిపరీక్షలు నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని యంపిఓలను ఆదేశించారు. కంటివెలుగు ప్రారంభ కార్యక్రమంలో అన్ని మండలాలు, మున్సిపల్ ప్రత్యేక అధికారులు పాల్గొనాలని పర్యవేక్షణ చేయాలని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఇంత మంచి కార్యక్రమం నిర్వహణలో మన జిల్లా ఆదర్శంగా నిలవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని చెప్పారు. ఏ రోజు కార్యక్రమ వివరాలు అదే రోజు డేటా ఎంట్రీ చేయాలని, పెండింగ్ ఉంచొద్దని ఆయన స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, డిసిఓ వెంకటేశ్వర్లు, డిఆర్వో అశోక్ చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసిల్దారులు యంపిడిఓలు, యంపిఓలు, వైద్యాధికారులు, కంటివెలుగు సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
