సృజనాత్మకతో కూడి
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 19..విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి చదువే మూలాధారమని, తమ చదువుకు సృజనాత్మకత జోడించి మంచి నాణ్యమైన విద్యను అందుకున్నప్పుడే ఉన్నత శిఖరాలు చేరుకోగలరని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గుగులోతు శంకర్ నాయక్ తెలిపారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని బొల్లోరు గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న ఆయన నేటి పిల్లలను వారి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలకు ఓర్చి చదివిస్తున్నారని ఇటువంటి పరిస్థితులలో పిల్లలు సెల్ ఫోన్లు వంటి తాత్కాలిక ఆనందాలకు లొంగకుండా జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి శాశ్వత ఆనందాన్ని పొందాలని చెప్పారు. దీనికోసం నిరంతరం కృషిచేసి, అబ్దుల్ కలాం వంటి మహానుభావుల ప్రేరణతో లక్ష్యాలు చేరుకోవాలని కోరారు. ఇదే ప్రేరణతో తాను ఒక గిరిజన తండా నుంచి ఉన్నత విద్యను అభ్యసించి ఈ రోజు రాష్ట్ర సమాచార హక్కు కమీషనర్ వంటి ఉన్నత స్థానాన్ని అధిరోహించడానికి చదివే ముఖ్య కారణమని పునరుద్ఘాటించారు. విద్యార్థినీ విద్యార్థులు అందరూ తమ లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తూ లక్ష్యాన్ని సాధించేవరకు విశ్రమించకూడదని, అలా విశ్రమించిన వాళ్లు జీవితంలో సాధారణ వ్యక్తులుగానే మిగిలిపోతారని తెలిపారు. ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు కూడా నిరంతరం విద్యార్థులను ఉత్తేజపరిస్తూ వారికి నాణ్యమైన విద్యను అందిస్తూ వారికి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దాలని, వారికి మంచి మార్గదర్శకత్వాన్ని వహించి వారు జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకునేటట్లుగా ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారిని తేజపరుస్తూ వారి లక్ష్యసాధన కోసం శ్రమించేటట్లుగా స్ఫూర్తిని కలిగించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్, సమ్మేళత విద్యా కోఆర్డినేటర్ ఎస్కే సైదులు, మండల విద్యాశాఖ అధికారి జై శ్రీరామ్ మూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆదినారాయణ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,
రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
