మన్యం న్యూస్ మణుగూరు టౌన్, జనవరి 20 మణుగూరు సింగరేణి ఓబి కంపెనీలలో పని చేస్తున్న ఓబి డ్రైవర్లకు ఆపరేటర్లకు హై స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో శనివారం ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి లలిత్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు .ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్ మాట్లాడుతూ,గత ఏడాది సెప్టెంబర్ నెలలో 18 రోజుల సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్ 26వ తేదీన ఏ ఎల్ సి సమక్షంలో సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీతో సింగరేణి యాజమాన్యం చేసుకున్న ఒప్పందం ప్రకారం సింగరేణి ఉపరితల గనులలో మట్టి వెలికితీత పనులు నిర్వహిస్తున్న కంపెనీలలో పనిచేస్తున్న టిప్పర్ డ్రైవర్లకు, భారీ యంత్రాల ఆపరేటర్లకు సెంట్రల్ జీవో ప్రకారం హై స్కిల్డ్ వేతనాలు అమలు చేస్తామని, వ్రాతపూర్వక ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. ఆ ఒప్పందం ప్రకారం,ఈ అంశానికి సంబంధించిన సర్క్యులర్ జారీ కావడంలో జాప్యం జరుగుతున్నదని దీంతో ఓబి కంపెనీలలో పనిచేస్తున్న అనేక మంది డ్రైవర్లు,ఆపరేటర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సింగరేణి ఉత్పత్తి ఉత్పాదకతలలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఓబి వర్కర్ల సమస్యల పట్ల సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని, హైస్కిల్డ్ వేతనాలు అమలకు సంబంధిత సర్క్యులర్ జారీ చేయాలని,ఓ బీ కంపెనీలో అమలు అయ్యే విధంగా కేంద్ర కార్మిక శాఖ తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు, అదే విధంగా అన్ని విభాగాల ఓబి వర్కర్లకు సింగరేణిలో ఉచిత వైద్యానికై మెడికల్ అటెండెన్స్ బుక్కులు ఇవ్వాలి అని,మెడికల్ అలవెన్స్ చెల్లించాలి అన్నారు. ఓబి కంపెనీల ఆపరేషన్,గ్యారేజీ లలో 8 గంటల పని విధానం అమలు చేయాలి అని అలాగే ఓబీ కంపెనీలలో 80% స్థానికులకు,సమీప గ్రామాల ప్రజలకు సింగరేణి భూ నిర్వాసితులకు,సింగరేణి కార్మికుల పిల్లలకు ఉపాధి కల్పించాలి అన్నారు.సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి సామాజిక బాధ్యతలో భాగంగా సింగరేణి భూ నిర్వాసిత నిరుద్యోగులకు, స్థానిక డ్రైవర్లకు ఉచిత వోల్వో టిప్పర్ డ్రైవింగ్,ఆపరేటర్లుగా డ్రైవర్లుగా,వృత్తి విద్య అప్రెంటిస్ శిక్షణలు ఇప్పించి, వారి ఉపాధికి సింగరేణి యాజమాన్యం సహకారం అందించాలి అన్నారు.ఈ కార్యక్రమంలో పెనుగొండ నాగార్జున,నాగేశ్వర్,వంశీ తదితరులు పాల్గొన్నారు.
