ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపుతున్న రైతాంగం *ప్రభుత్వ ప్రోత్సాహంతోనే రైతాంగం నూతన అడుగులు
* పామ్ ఆయిల్ సాగుపై రైతులు ప్రభుత్వ సబ్సిడీ
*రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చెయ్యాలి: ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా
మన్యం న్యూస్ గుండాల గుండాల,ఆళ్లపల్లి మండలాల్లో రైతాంగం ప్రత్యామ్నాయ పంటల వైపు వడివడిగా అడుగులు వేస్తూ నూతన పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. రెండు మండలాల్లోని రైతులు ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న, పత్తి, వరి పంటలు అధిక మొత్తంలో సాగు చేస్తారు. కానీ ప్రత్యామ్నాయ పంటల వైపు ఈ రెండు మండలాల్లోని రైతులు గడిచిన కాలంలో ఏమాత్రం ఆలోచించని రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్నారు. రెండు మండలాల్లో పంట మార్పిడి కోసం రైతాంగం మొగ్గు చూపింది. గత ఏడాది నుండి అధిక మొత్తంలో పొద్దుతిరుగుడు, పల్లి, బొబ్బర, తదితర పంటల వైపు మొగ్గు చూపి వాటిని పండిస్తున్నారు. యాసంగి లో సైతం వరిని వేయకుండా ఇతర పంటల వైపు రైతాంగం అడుగులు వేసింది. యాసంగి లో నీటి ఎద్దడి ఎదురవుతోందని అందుచేత అధిక నీరు వినియోగించే పంటలను వేయకూడదని రైతులు నిర్ణయించుకున్నట్లు మన్యం న్యూస్ కి తెలిపారు. సాగు కి అనువుగా నూతన విద్యుత్ లైన్లు, బోర్లు మంజూరు చేస్తే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతాంగ మొగ్గుచూపి సాగుపై రైతులు ఆసక్తి కనపరిచే అవకాశం ఉంది
పామాయిల్ సాగుకు ప్రభుత్వ సబ్సిడీ
ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
రైతులు ప్రత్యామ్నాయ పంటల వేసేందుకు ముందుకు రావాలని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు. నూతన ఎవరవడితో వ్యవసాయం చేస్తే రైతాంగం పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం అనేక పథకాలను రూపకల్పన చేసి వాటిని అమలు పరుస్తుందని ప్రత్యామ్నాయ పంటలకు అనేక ప్రోత్సాహకాలను ఇస్తున్నందున రైతులు వాటి వైపు మొగ్గు చూపాలి అన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేయటం వలన రైతులకు పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని రైతాంగానికి ప్రభుత్వం తరఫున సహకారం అందే విధంగా చూస్తానని అందుచేత రైతులు ఆలోచించి నూతన పంటల వైపు అడుగులు వేయాలన్నారు. పామాయిల్ సాగు చేసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం అధిక సబ్సిడీ అందజేస్తుందని, ఏజెన్సీ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
