UPDATES  

 కసితో ఒకరు- కడుపు మంటతో మరొకరు పినపాక మండల వ్యవసాయ విస్తరణ అధికారులుగా రాణిస్తున్న యువకులు

కసితో ఒకరు- కడుపు మంటతో మరొకరు

పినపాక మండల వ్యవసాయ విస్తరణ అధికారులుగా రాణిస్తున్న యువకులు

కడుపు కాలితేనే అన్ని వస్తాయి- మనం ఏం చేయగలమో మనకే తెలుసు

మన్యం న్యూస్, పినపాక:

లేలేత వయసులోనే వ్యవసాయంపై ఉన్న మక్కువతో 23 సంవత్సరాల వయసులోనే వ్యవసాయ విస్తరణ అధికారులుగా నియమించబడి, పినపాక మండలంలోని పినపాక, జానంపేట క్లస్టర్ పరిధిలో తమ అమూల్యమైన సేవలను రైతన్నలకు అందిస్తున్న యువ వ్యవసాయ విస్తరణ అధికారుల గురించి మన్యం న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

1) దొడ్డాకుల. కేశవరావు (జానంపేట క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి):

మా ఊరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం నారావారి గూడెం. నాన్న శ్రీరామ్మూర్తి, అమ్మ నాగేశ్వరమ్మ. ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చాను. నాన్న తనకు గల మూడెకరాల వ్యవసాయం చేస్తున్నారు. అమ్మ అశ్వరావుపేటలోని నర్సరీలో రోజువారి కూలిగా పనిచేస్తున్నారు. పదవ తరగతి ఏన్కూరులోని గురుకుల పాఠశాలలో పూర్తి చేసిన నేను, పై చదువులు చదవడానికి ఆర్థిక స్తోమత లేక అగ్రికల్చర్ డిప్లమాను నల్గొండలో పూర్తి చేయడం జరిగింది. అనంతరం బీఎస్సీ అగ్రికల్చర్ హైదరాబాదులో గల రాజేంద్రనగర్ యూనివర్సిటీలో స్టేట్ ర్యాంకు పొంది పూర్తి చేశాను. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతుండగానే వ్యవసాయ విస్తరణ అధికారుల నోటిఫికేషన్ రావడంతో, పట్టుదలగా సున్నద్ధమై 23 సంవత్సరాల వయసులోనే ఉద్యోగం పొందాను. ఈ సందర్భంగా “మన్యం న్యూస్” తో మాట్లాడుతూ, కాలే కడుపు ఉంటే అన్నీ వస్తాయని, చిన్నప్పటినుండి కడుపేదరికం అనుభవించానని, తన తల్లి ఇప్పటికీ అశ్వరావుపేటలోని నర్సరీకి రోజువారి కూలీగా వెళుతుందని, అన్ని రకాల సదుపాయాలు ఉండి యువత అవకాశాలను వినియోగించుకోవడం లేదని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించడం లేదని, పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చునని అన్నారు. వ్యవసాయాన్ని ముందు తరాలకు ఉపయోగపడే విధంగా సాగు చేస్తే భవిష్యత్తు బంగారు బాటలా ఉంటుందని అన్నారు.

2) కొమ్మనబోయిన రమేష్ .(పినపాక క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి):

మా ఊరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం. నాన్న మల్లయ్య, అమ్మ సుశీల. హెవీ వాటర్ ప్లాంట్ నిర్మాణ సమయంలో మా భూమి కోల్పోవడం వల్ల మా నాన్న, హెవీ వాటర్ ప్లాంట్ కార్యాలయంలో ప్యూన్ గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. పదవ తరగతి మణుగూరులోని గ్రేస్ మిషన్ పాఠశాలలో పూర్తి చేసిన నేను, సైన్స్ బోధించిన నా గురువు అమితాబ్ ప్రోత్సాహంతో, ఇంటర్ బైపీసీ పూర్తి చేసి బీఎస్సీ అగ్రికల్చర్ ఔరంగాబాద్ లో పూర్తి చేశాను. అమితాబ్ సార్ ప్రోత్సాహం మరువలేనిది. బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన సంవత్సరం వ్యవసాయ విస్తరణ అధికారుల నోటిఫికేషన్ రావడంతో, పట్టుదలతో చదివి 23 సంవత్సరాల వయసులోనే ఉద్యోగం పొందాను. ఈ సందర్భంగా మన్యం న్యూస్ తన అనుభవాలను గురించి అడుగగా, మనము ఏమి చేయగలము మనకే తెలుసు. సలహాలను స్వీకరించాలి కానీ, నిర్ణయం మనమే తీసుకోవాలి. యువత నేటి కాలంలో చెడు మార్గాల వైపు ఎక్కువగా పయనిస్తున్నారు. భవిష్యత్తు సన్మార్గం కోసం పునాది మనమే వేసుకోవాలి. వ్యవసాయాన్ని ఒక సాంప్రదాయంలా మార్చినప్పుడే రైతు ముందు తరాలకు ఉపయోగం అని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !