మన్యం న్యూస్, సారపాక , జనవరి 25
తెలంగాణలో విద్యుత్ వినియోగదారులపై అదనపు లోడు చార్జీల పేరుతో రైతులు, సామాన్య ప్రజల మీద ప్రభుత్వం భారం మోపుతూ కరెంట్ షాక్ ఇస్తుందని పూలపల్లి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యుత్ సంస్థలు ఏసీడి పేరుతో పేదోడిని దోపిడీ చేస్తున్నారని, టీవీ రీచార్జిలు ఎట్లాగైతే చేసుకుంటామో అలాగే భవిష్యత్తులో విద్యుత్ మీటర్లకు కూడా రీఛార్జ్ పద్ధతి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుందని అది మరింత ప్రమాదకరమని అన్నారు. అద్దె ఇంట్లో ఉండేవారు ఏసిడి చార్జీలు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ఒక్కో కనెక్షన్ కి వెయ్యి రూపాయల నుంచి 3,500 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని, గతంలో ఏసీడీ చార్జీలు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే కార్యాలయాలకు, పలు రకాల వ్యాపార, వాణిజ్య సంస్థలకు మాత్రమే విధించేవారని, తాజాగా ప్రతి విద్యుత్ వినియోగదారుడు పై ఈ భారం మోపడం సామాన్యులను ఆందోళన చెందేలా చేస్తుందని పేర్కొన్నారు. అతిపెద్ద డీఫాల్టర్ ప్రభుత్వమేనని 25 వేల కోట్ల ప్రభుత్వ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వారు కడితే ఈ సమస్య ఉండదని, పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఏసీడీ చార్జీలు ఎందుకు వసూలు చేయరని ప్రశ్నించారు. కరెంట్ ఏ సి డి చార్జీల విషయంలో ప్రభుత్వం దిగి రావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.