చిక్కరు.. దొరకరు
వరుస దొంగతనాలు….
-బెంబేలెత్తుతున్న ప్రజలు.
– ఇళ్లల్లో ఉన్న బైకులు మాయం.
– ఊరినిండా సీసీ కెమెరాలే.
-అయినా కానరాని దొంగలు.
-దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక టీములు.
– మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు.
మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 25: పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. పగలు రాత్రి అని తేడా లేకుండా దొంగలు పెట్రేగిపోతున్నారు. ముఖ్యంగా మణుగూరు, అశ్వాపురం మండలాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న అశ్వాపురం మండలంలో మహిళ మెడలో దొంగలు చైన్ లాక్కొని వెల్లారు. మణుగూరులో ఇళ్లలో పెట్టిన ద్విచక్ర వాహనాలు వరుసగా మాయమవుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దొంగలు దర్జాగా వచ్చి తమ పని తాము చేసుకొని పోతున్నారు. మూడు పువ్వులు ఆరు కాయలుగా దొంగల రాజ్యం కొనసాగుతోంది. చోద్యం ఏమిటంటే వాడ వాడన సీసీ కెమెరాలు ఉన్న దొంగలు మాత్రం చిక్కడం లేదు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఎవరి ఇళ్లల్లో దొంగలు చొరబడతారో అని కంటిమీద కునుకు లేకుండా భయంతో వణికి పోతున్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము దొంగల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు.
-దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక టీములు.
– మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు.
వరుస దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేస్తున్నాం. పెట్రోలింగ్ ను కూడా పెంచుతున్నాం. దొంగతనాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దొంగతనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.