మన్యం న్యూస్ గుండాల ఫిబ్రవరి 04: ప్రజల రక్షణతో పాటు ప్రజా సేవలో ముందుంటామని ఇల్లందు డిఎస్పి రమణమూర్తి అన్నారు. శనివారం మండలం పరిధిలోని దామరతోగు గ్రామ ప్రజలతో సమావేశమై వారికి వాలీబాల్, సోలార్ లైట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ ప్రజల రక్షణలో ఎల్లవేళలా ముందు వరసలో నిలుస్తుందని అన్నారు. ఆపద సమయంలో పోలీస్ శాఖ సూచించే నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని ఆయన తెలిపారు. మారుమూల అడవి ప్రాంతమైన దామరతోగు ప్రజలకు ఏదైనా చేయాలనే సంకల్పంతోనే గతంలో సైతం హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామంలోని యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని ఆయన కోరారు. దామరతోగు గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలిచి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని డిఎస్పి రమణమూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల సీఐ కరుణాకర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్, సర్పంచ్ సుతారి సరోజిన, ఎంపీటీసీ కృష్ణారావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు .
