ప్రజలపై అదనపు భారాలు సహించం
ఏసిడి చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలి
విద్యుత్, పెట్రోల్, అధిక ధరలతో సామాన్యులను దోచుకుంటున్న పాలకులు
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా
సిపిఐ ఆధ్వర్యంలో విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ధర్నా
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 06..పన్నులు, అదనపు చార్జీలు, అపరాధ రుసుముల పేరుతో ప్రజలపై భారాలు మోపితే సహంచబోమని, పేద ప్రజలను లూటీ చేసే చర్యలను పాలకులు మానుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాష డిమాండ్ చేశారు. అసిడి చార్జీలు ఉపసంహరించుకోవాలని, వ్యవసాయానికి త్రీఫేసుతో కూడిన విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా చేయాలని, దరఖాస్తుదారులందరికి విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యాలయం ఎదుట బైటాయించి ఏసీడీ చార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారికి అందించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ అదనపు సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో టిఎస్ఎస్పిడిసిఎల్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతున్నాయని, ఒక్కో గృహ యజమాని నుంచి రూ. రెండు వేలకు పైగా వసూలు చేసే కుట్రలకు తెరలేపారన్నారు. బడాబాబుల కంపెనీలు, పరిశ్రమలు, వ్యాపార సముదాయాలకు సంబందించి కోట్లలో విద్యుత్ బకాయిలు ఉన్నప్పటికి వాటిని వసూలు చేసేందుకు ప్రభుత్వం, విద్యుత్ సంస్థ వెనుకడుగు వేస్తున్నాయన్నారు. విద్యుత్, పెట్రోల్, అధిక ధరలతో సామాన్యులను దోచుకుంటూ తమ ఖజానాను నింపుకునేందుకు పాలకులు ప్రయత్నంచడం దారుణమన్నారు. ప్రభుత్వం హామీ మేరకు వ్యవసాయ రంగానికి త్రీఫేసుతో కూడిన విద్యుత్తును రంతరాయంగా సరఫరా చేయాలని, దరఖాస్తు చేసుకున్న వారందరికి విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, పార్టీ, ప్రజా సంఘాల నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, బాగం మహేశ్వర్రావు, మాచర్ల శ్రీనివాస్, నేరెళ్ళ శ్రీనివాస్, గడ్డం రాజయ్య, షాహీన్, దాసరి జ్యోతి, షమీమ్, విజయలక్ష్మి, అబ్బులు, పాషా, కె.రవీందర్, రాంజి, శంకర్, నదీన్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.
