మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం. ఫిబ్రవరి 07
అధికారులు ఏజెన్సీ ఏరియాలో తమ ఇష్టా అనుసారంగా వ్యవహారిస్తూ, ప్రజలను, ప్రజా ప్రతినిధులను మోసం చేస్తూ మభ్యపెడుతున్నారు అని వాసం నాగరాజు విమర్శించారు. మంగళ వారం ఆదివాసీ నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో ఆ సంఘ రాష్ట్ర కార్య నిర్వహణ అధ్యక్షులు వాసం నాగరాజు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. సుమారు 400 మంది ర్యాలీ గా వచ్చి ఎంపిడిఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ సందర్బంగా నాగరాజు అధికారుల తో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 1700 వందల మంది దరఖాస్తులు చేసుకుంటే కేవలం 70 మందికి మాత్రమే హక్కు పత్రాలు ఇవ్వడానికి అనుమతులు వచ్చాయన్నారు.ఆదివాసీ ప్రజా ప్రతినిధులను, ప్రజల పైన అధికారులు కర్రపెత్తనం చేస్తున్నారని విమర్శించారు. తిరస్కరణకు గురైన అన్ని దరఖాస్తులను ఎందుకు పునః పరిశీలన చేయడం లేదని ప్రశ్నించారు. బర్లగూడెం, రాచపల్లి, ఎదిరా గ్రామపంచాయతీ ల్లో పోడు గ్రామ సభలను ప్రజలే ప్రత్యక్షంగా రద్దు చేయడం జరిగిందని అన్నారు. గ్రామసభలు రద్దు చేస్తే అధికారులు గ్రామసభ జరిగినట్టు తప్పుడు నివేదికలు ప్రభుత్వానికి పంపించారని అన్నారు. గ్రామ సభలు జరగకుండానే ఎఫ్ ఆర్ సి కమిటీల అభిప్రాయాలు స్వీకరించ కుండానే దరఖాస్తులన్నీ ఎలా తిరస్కరణకు గురి అయ్యాయి అని అధికారులను నిలదీశారు. దరఖాస్తు చేసుకున్న వారి భూములను ఇంకా కొంతమంది వి సర్వే చేయలేదని అన్నారు. చట్ట ప్రకారం సర్వే చేయాలని అన్నారు. చేయకపోతే చట్ట రీత్యా నేరం అన్నారు. ఒక దరఖాస్తుని జిల్లా కమిటీ రద్దు చేస్తే, రద్దు చేయడానికి గల కారణాలను దరఖాస్తు దారుడికి నోటిస్ రూపం లో ఇవ్వాలని తెలియజేశారు. ఒక దరఖాస్తు దారుడికి మూడు సార్లు తన హక్కు కోసం అప్పీల్ చేసుకునే హక్కు చట్టం కల్పించింది అన్నారు. ఛాయా చిత్రాలు మాత్రమే పరిగణలోకి తీసుకొని ఆదివాసీల హక్కుని కాలారాయడం చట్ట రీత్యా నేరం అన్నారు. పక్క మండలాల్లో అసలు ఏ ఒక్కపోడు దరఖాస్తు తిరస్కరణకు గురికాలేదు అన్నారు. ఇక్కడ మాత్రమే 99శాతం దరఖాస్తులు తిరస్కరణ కు గురి అయ్యాయి అన్నారు. ఆదివాసీలకు హక్కు పత్రాలు రాకపోవడం లో జిల్లా కలెక్టర్ తో పాటు తహసిల్దార్ కూడా ప్రధాన కారణం అని ఆయన మండిపడ్డారు. ఎం పీపీ సతీష్ కుమార్ , జెడ్ పిటిసి పాయం రమణ కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. సాగులో ఉన్న వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వక పొతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఏదిరా, రామచంద్రపురం, సూరవీడు, తిప్పపురం, బోధపురం, రాచపల్లి బర్లగూడెం గ్రామ పంచాయతీ పోడు రైతులు పాల్గొన్నారు.
