మన్యం న్యూస్ ,నుగురు వెంకటాపురం, ఫిబ్రవరి 07
పోడు గ్రామసభ ప్రజలు ఏక గ్రీవంగా రద్దు చేస్తే అధికారులు మాత్రం గ్రామసభ జరిగినట్లు తప్పుడు నివేదికలు పంపించారు అని బర్లగూడెం సర్పంచి కోర్స నర్సింహా మూర్తి తహసీల్దార్ అంటి నాగరాజు పైన మండిపడ్డారు. మంగళవారం మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం ఎం పీపీ చెరుకూరి సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. సభ లో అధికారుల పైన సర్పంచి నర్సింహా మూర్తి ప్రశ్నల వర్షం కురిపించారు. పోడు భూముల దరఖాస్తుల పరిశీలన పూర్తిగా లోపభూయిష్టంగా జరిగిందన్నారు. మొదటి విడతలో తిరస్కరణకు గురైన దరఖాస్తులు అన్నిటికి పునః పరిశీలన కోరే హక్కు చట్టం కల్పించిందని సభలో మాట్లాడారు. పోడు భూముల పరిశీలన సభలకు అటవీ శాఖా అధికారులు ఎందుకు రావడం లేదని సర్పంచి నర్సింహా మూర్తి సెక్షన్ అధికారి దేవరాజ్ అని అడగగా డి ఎఫ్ ఓ మాకు శాఖా పరమైన ఉత్తర్వులు ఏవి ఇవ్వలేదని అందుకే గ్రామసభలకు హాజరు కావడం లేదని బదులు ఇవ్వడం జరిగింది. ప్రజలను, ప్రజా ప్రతినిధులను మభ్యపెట్టి గుట్టు చప్పుడు కాకుండా రైతుల నుండి సంతకాలు ఎలా చెకరిస్తున్నారు అని సభలో తహసీల్దార్ ని ప్రశ్నించారు. ప్రజల అభిష్టం మేరకు పెసా గ్రామసభ నిర్వహించి దరఖాస్తుల పునః పరిశీలన చేయాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్నప్పటికి సర్వే చేయని వారికీ తక్షణమే సర్వే చేయాలనీ, తిరస్కరణకు గురైన అన్ని దరఖాస్తులను పునః పరిశీలన చేయాలి అన్నారు. దీన్ని మండల పరిషత్ లో తీర్మానం చేయాలని సభలో పట్టు పట్టినారు. సభా అధ్యక్షులు సతీష్ కుమార్ తీర్మానం చేటున్నట్లు హామీ ఇవ్వడం తో వాదన సద్దుమణిగింది.