మన్యం న్యూస్, భద్రాచలం , ఫిబ్రవరి 09..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ కళ్ళజోళ్ళు పంపిణీ చేయాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గౌతమ్ పోట్రూ అన్నారు. గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు కేంద్రమును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆదివాసి గ్రామాల్లో పనిచేయుచున్న వైద్య సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే గిరిజనులకు, ఆహార నియమాల గురించి వారికి తెలియజేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. అనంతరం కంటి వెలుగు కి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కంటి వెలుగు కేంద్రాల గురించి గ్రామాలలో విరివిగా ప్రచారం చేయించాలని, కంటి వెలుగు కేంద్రాలకు జనం వచ్చేలా వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఇప్పటివరకు ఇక్కడ జరుగుతున్న కేంద్రంలో ఎంతమంది కండ్ల పరీక్ష చేయించుకున్నారని డిఎం అండ్ హెచ్ఓ నీ అడిగి తెలుసుకుని, ఐటిడిఎ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటికి తిరిగి ఈ కేంద్రం గురించి తెలియజేసి అందరికీ కండ్ల పరీక్షలు చేయించాలని తెలిపారు. అనంతరం కంటి వెలుగు కేంద్రంలోని కరపత్రాలను కళ్ళజోళ్లను పరిశీలించి, కంటి పరీక్ష చేయించుకున్న వారికి కళ్ళజోళ్ళు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓ శిరీష, కేంద్రం ఇంచార్జ్ వినయ్, పీఎంవో వినయ్ కుమార్, హెచ్ వి సంధ్యా వాణి, ఏఎన్ఎంలు నాగమణి, విజయలక్ష్మి, డిఇఓ యాకూబ్ రెడ్డి, ఆశా వర్కర్లు రమాదేవి, పార్వతి, మలేరియా హెచ్ఇఓ కృష్ణయ్య, దుర్గయ్య, ఏడీఎంహెచ్వో కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.