మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 10
పోడు భూములు సాగు చేస్తున్న ప్రతి ఆదివాసి గిరిజనుడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హక్కుపత్రాలు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోర్స చిలకమ్మ సరియం రాజమ్మలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం దుమ్ముగూడెం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సంబంధిత సెక్షన్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి తోడం తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన ధర్నా లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు కోర్స చిలకమ్మ, జిల్లా కమిటీ సభ్యురాలు సరియం రాజమ్మ మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలంలో 22 గ్రామపంచాయతీ పరిధిలో తరతరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటూ దరఖాస్తులు చేసుకున్న ఆదివాసీల అందరికీ ఎటువంటి ఆంక్షలు లేకుండా పోడు హక్కు పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలోనే అందరికీ హక్కు పత్రాలు మంజూరు చేస్తామని తీర్మానం చేయాలని అసెంబ్లీ సమావేశంలో ఆమోదం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో రానున్న కాలంలో మరిన్ని ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరిక చేశారు. పోడు భమి సాగుదారులపై ఫారెస్ట్ పోలీస్ అధికారులు పెట్టిన అక్రమ కేసులను కూడా వెంటనే ఎత్తివేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మీడియం జయ, పూనెం కనకదుర్గ ,పెసా కమిటీ చైర్మన్ సున్నం వెంకటేశ్వర్లు, పూసం వెంకన్న బాబు, తుర్రం సుబ్బారావు, సోయం భూపతి, కారం కామయ్య,మంగమ్మ, మచ్చా వీరయ్య తదితరులు పాల్గొన్నారు.