మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 14: సింగరేణి ఉచిత శిక్షణ ద్వారా పోలీస్ శాఖలో ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడాలని మణుగూరు ఏరియా జిఎం రామచందర్ అన్నారు. ఆయన మంగళవారం స్థానిక జీఎం కార్యాలయం వద్ద ఉచిత శిక్షణ పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖచే నిర్వహించబడిన రిక్రూట్మెంట్ ర్యాలీ కొరకు పివి కాలనీ భద్రాద్రి స్టేడియంలో 3 నెలల పాటు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మణుగూరు ప్రాంత సింగరేణి ఉద్యోగుల, మాజీ ఉద్యోగుల పిల్లలకు, స్థానిక, భూనిర్వాసితుల, పరిసర గ్రామాల యువతీ యువకులకు కార్పొరేట్ సామాజిక భాద్యతలో భాగంగా శారీరక ధారుడ్య శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఫిజికల్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులకు తదుపరి నిర్వహించబడే వ్రాత పరీక్షల నిమిత్తం పుస్తకాలను అందజేయడం జరుగుతుందన్నారు. సింగరేణి యజమాన్యం తమ వంతు సామాజిక భాద్యతగా పట్టణ, పరిసర ప్రాంతాల అభివృద్ధికి లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేబట్టుతుందన్నారు. సింగరేణి కుటుంబాల మహిళలతో సమానంగా స్థానిక, పరిసర గ్రామాల మహిళలకు అనేక రకాల వృత్తి విద్యల్లో ఉచిత శిక్షణ ఇవ్వడం వలన ఎందరో మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారన్నారు. నిరుద్యోగ యువతకు పోలీసు,ఆర్మీ శాఖల్లో ఉచిత శిక్షణ ఇవ్వడంలో ఆయా శాఖల్లో ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వో టు జిఎం లలిత్ కుమార్,ఏజెంట్ కేపియూజి నాగేశ్వర రావు, డిజిఎం పర్సనల్ రమేశ్,సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్,గుర్తింపు సంఘం నాయకులు ప్రభాకర్ రావు ,అబ్దుల్ రావూఫ్, బానొత్ కృష్ణ, వీరభద్రుడు, స్పొర్ట్స్ అసిస్టెంట్ సూపర్ వైజర్ జాన్ వెస్లీ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
