మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 14: రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్ మంగళవారం అన్నారు. మీ ఇంట్లో వాళ్లని, మీ పార్టీ వాళ్లని మాట్లాడినట్టు ఎమ్మెల్యే రేగా కాంతారావుని విమర్శిస్తే ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకొని లేరన్నారు. పినపాక నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారన్నారు. అన్ని రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రజలకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. మీరు, మీ నాయకులు ఉనికిని చాటుకోవడం కోసం అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. పినపాక నియోజకవర్గం లో అభివృద్ధిని చూసి ఓర్వలేక మాట్లాడుతున్న నాయకులకి ఒకటే చెబుతున్నాం నడి బజార్లో చర్చకు సిద్ధమన్నారు. కెసిఆర్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి పల్లెకు వెళ్దాం మీకు లాగా ఊక దంపుడు మాటలుతో పబ్బం గడుపుకునే నాయకులతో మాకు పనిలేదన్నారు. రేగా కాంతారావు జోలికొస్తే ఖబడ్దార్ ప్రజలే తరిమికొడతారన్నారు.
