UPDATES  

 తెలంగాణలో బిజెపి వచ్చేదే లేదు

తెలంగాణలో బిజెపి వచ్చేదే లేదు
– సీఎం భద్రాచలంకి ఎన్ని కోట్ల నిధులు ఇచ్చారు చెప్పాలి
– భద్రాచలంలో హత్ సే హత్ జోడో యాత్ర
– పాదయాత్రలో రేవంత్ రెడ్డి

మన్యం న్యూస్, భద్రాచలం :

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి నాయకులు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని గొప్పలు చెప్పుకుంటున్నారని, అలా చెప్పుకునే బిజెపి నాయకులు బోడి గుండు పై జుట్టు వచ్చేదు… తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వచ్చేది లేదని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న హత్ సే హత్ జోడో పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం సమయానికి సారపాక చేరుకొని సారపాక గ్రామంలో నుండి భద్రాచలం వరకు పాదయాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సారపాక ప్రధాన కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తొలుతగా రేవంత్ రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడినుండి పాదయాత్ర చేస్తూ భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వరకు చేరుకున్నారు. అక్కడ డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే పోదాం వీరయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ సభలో మాజీ టిసిసిపి అధ్యక్షులు హనుమంతరావు, మాజీ కేంద్రమంత్రి, ఎంపీ బలరాం నాయక్, మధిర నియోజకవర్గం శాసనసభ్యులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర టిసిసిపి అధ్యక్షులు రేవంత్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ టిసిసిపి అధ్యక్షులు హనుమంతరావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే అని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ… భద్రాచలం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసిందని పేర్కొన్నారు. గోదావరిపై ఉన్న బ్రిడ్జిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించింది అన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎంతో గొప్ప చరిత్ర ఉన్న భద్రాచలం ప్రాంతం నేటి పాలకుల నిర్లక్ష్యం వల్ల గుర్తింపును కోల్పోయిందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానని చెప్పి, భద్రాచలం టెంపుల్ సిటీగా మారుస్తానని హామీ ఇచ్చి ఆ భద్రాద్రి రాముని మోసం చేశారని ఆరోపించారు. భద్రాచలం నియోజకవర్గం కి తొమ్మిది ఏండ్లలో భద్రాచలం ఎన్ని కోట్ల నిధులు ఇచ్చారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చోటనే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని.. అదేవిధంగా కేసీఆర్ ఎవరికైతే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారు వాళ్ళని ఓట్లు అడిగి గెలవాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోష్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో సైతం రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ ఐదు నూరుల రూపాయలకే అందిస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ 150 రోజులు ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్న రాహుల్ గాంధీని కాంగ్రెస్ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి చంద్రశేఖర రావు, కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, బట్ట విజయ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

రేవంత్ పాదయాత్రలో అపశృతి

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హత్ సే హత్ జోడో పాదయాత్రలో మంగళవారం అపశృతి చోటుచేసుకుంది. ఈ పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం సారపాక సెంటర్ కు చేరుకున్నారు. ఆ సమయంలో స్థానిక ప్రజలు ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు తరలివచ్చారు. వారిలో రేవంత్ రెడ్డికి సమీపంలోనే ఓ వ్యక్తి మూర్చ వచ్చి రోడ్డుపైనే పడిపోయాడు. స్థానిక నాయకులు సైతం అది గమనించకుండా రేవంత్ వైపుగా వెళుతుండడంతో అక్కడే ఉన్న సిఐ నాగరాజు ఆ వ్యక్తిని గమనించి అక్కడికి చేరుకుని ఆసుపత్రికి పంపించే ఏర్పాట్లు చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !