మన్యం న్యూస్: జూలూరుపాడు, ఫిబ్రవరి 16, మండల కేంద్రంలోని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్ ను జూలూరుపాడు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, మండలంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలం కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పాత్రికేయుడు మోదుగు ప్రభాకర్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో వివిధ పత్రికలు, చానల్స్ లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం కానీ, ఇంటి నిర్మాణానికి నిధులు కానీ మంజూరి చేయలేదని, ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టులో ఉన్న కేసు జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు వచ్చిన క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాలు కేటాయించి హక్కు పత్రాలు అందజేస్తున్నారని, కావున జూలూరుపాడు మండలంలో పనిచేస్తున్న 42 మంది వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలం కేటాయించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి ప్రకటన చేశారని, ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం కేటాయించడం జరుగుతుందని అన్నారు. స్థానిక తహశీల్దార్ ఆర్ శారద తో మాట్లాడి మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి తనకు అందజేయాలని ఆదేశించారు. ఈ సమస్యను వీలైనంత త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ జర్నలిస్టులతో పాటు ఎంపీపీ సోనీ, తహశీల్దార్ శారద, రెవిన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, మండల పార్టీ అధ్యక్షులు పొన్నెకంటి సతీష్ కుమార్, మండల రైతు బంధు సమితి కన్వీనర్ వీరభద్రం, పార్టీ సీనియర్ నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, పాండు, వేల్పుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
