కొత్తగూడెం మున్సిపాలిటీకి…. కోట్లలో నిధులు.. నిర్లక్ష్యపు విధులు
ప్రజల గొంతెండుతున్నా స్పందించరా…?
నీటి సమస్య శాశ్వత పరిష్కారంలో అధికారపక్షం విఫలం
ప్రజల దాహార్తిని తీర్చలేని పాలకవర్గం వున్నా లేనట్లే
కిన్నెరసాని నీటి సరఫరాను పునరుద్ధరించాలి
మున్సిపల్ సిపిఐ పక్ష నాయకులు వై.శ్రీనివాసరెడ్డి
సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కాళీ కుండలతో వినూత్న నిరసన
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 17… కోట్లలో నిధులు ఉన్నప్పటికీ కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు తాగునీరు అందించడంలో అధికారుల నిర్లక్ష్య ధోరణి కనబడుతుందని, ప్రజల గొంతెండుతున్నా మున్సిపల్ అధికార యంత్రాంగం, అధికార పక్షం స్పందించరా అని సిపిఐ కొత్తగూడెం మున్సిపల్ పక్ష నాయకులు వై.శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజలకు కిన్నెరసాని నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ సిపిఐ పక్ష కౌన్సిలర్లు, పలువురు నాయకులు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన వ్యక్తంచేశారు. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ ఖాళీ కుండలతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు, అధికారులు, అధికారపక్షం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపల్ ప్రజలకు ఉన్న ఎకైక నీటి వనరు కిన్నెరసాని నీటి సరఫరా పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు, అధికారపక్షం పూర్తిగా విఫలమైందని, నెలలో కేవలం నాలుగైదు రోజులు మాత్రమే నీటి సరఫరా చేపడుతూ ప్రజలను నీటి కష్టాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. పైపులైన్ల నిర్మాణం, మరమ్మత్తుల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృదా చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని, ఖర్చు చేస్తున్న ప్రజాధనం ఎవరి జేబుల్లోకి వెళుతుందని ప్రశ్నించారు. కిన్నెరసాని నీటి సరఫరా నిలిచిపోయిన రోజుల్లో మిషన్ భగీరధ ద్వారా నీటి సరఫరా చేపడతామని అధికారులు ఇచ్చి హామీ మైందన్నారు. వారం రోజులుగా పట్టణానికి నీటి సరఫరా నిలిచిపోయినప్పటికి ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజల దాహర్తిని తీర్చలేని స్థితిలో ఉన్న మున్సిపల్ అధికార పక్షానికి పదవులు అవసరమా అని ప్రశ్నించారు. తక్షణమే కిన్నెరసాని నీటి సరఫరాను పునరుద్ధరించాలని, ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేపట్టాలని లేనిపక్షంలో ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని కమిషనరుకు అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, భూక్య శ్రీనివాస్, బోయిన విజయకుమార్, పి.సత్యనారాయణచారి, పట్టణ నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు, మాచర్ల శ్రీనివాస్, నేరెళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
