ఐదుకు ఐదు మనవే
భద్రాద్రి కొత్తగూడెం గడ్డ.. బిఆర్ఎస్ అడ్డ..
-భద్రాచలంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం
-ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం న్యూస్, భద్రాచలం , ఫిబ్రవరి 20
రానున్న సాధారణ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదుకు ఐదు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పాల్గొని మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ కూడా అమలు కావడం లేదని తెలిపారు. ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడిగా సీఎం కేసీఆర్ పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. రానున్న సాధారణ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఐదుకు ఐదు అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలపై కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ధన బలంతో కొందరు నిర్వహించే సమావేశాలకు డబ్బులు ఇచ్చి జనాలని సమీకరిస్తున్నారని విమర్శించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్వహించే సమావేశాలకు మాత్రం కార్యకర్తలు అభిమానంతో వస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ వంటి పథకాలు బిజెపి అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా అమలవుతున్నాయని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. భద్రాచలంలో పూర్తిస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ విజయ సాధించడానికి ప్రతి కార్యకర్త పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఆయన గుర్తు చేశారు ప్రతి కార్యకర్తను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మానే రామకృష్ణ, తిప్పన సిద్ధులు, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.