రాష్ట్ర పార్టీ నిర్ణయం ప్రకారం బీఆర్ఎస్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నాం….
-బిజెపి ఒక మత పిచ్చి పార్టీ
-రాబోయే కాలంలో ప్రజలే వారికి బుద్ధి చెబుతారు.
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.
మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి20: రాష్ట్ర పార్టీ నిర్ణయం ప్రకారం బీఆర్ఎస్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన సోమవారం మణుగూరు లో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) పినపాక నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పినపాక నియోజకవర్గం లో బీఆరెస్ పార్టీ లోని కొందరు మా పార్టీని అవహేళన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తో పొత్తు ఉన్న, నియోజకవర్గంలో సిపిఐ పార్టీ స్వంతగా పోటీ చేస్తామని, పార్టీ కార్యకర్తలు అంటున్నారని అది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. బిజెపి వాళ్లు మత పిచ్చివారని, హిందువులు ఒక బిజెపి పార్టీలోనే ఉన్నారా హిందుత్వం కలిగిన వారు అన్ని పార్టీలలో ఉన్నారని ఆయన ఎద్దేవ చేశారు.
బిజెపి పార్టీ హిందుత్వం అనే సెంటిమెంట్ పేరుతో ప్రజల్ని మభ్యపెడుతూ పాలన సాగిస్తుందని, రాబోయే కాలంలో ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తులు సామరస్యంగా ఉంటే కలిసి ప్రయాణం చేస్తామని, లేకపోతే సిపిఐ పార్టీ 30 నుంచి 35 సీట్లలో పోటీ చేస్తుందని, 40 సీట్లలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే సత్తా సీపీఐ పార్టీ కి ఉందన్నారు. పినపాక నియోజకవర్గంలో సిపిఐ పార్టీ బలముగా ఉన్న, పోటీలో ఉండాలా వద్దా అనేది రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య చారి, ఎస్ కే షాబీర్ పాష, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మి కుమారి, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
