మండల బీఆర్ఎస్ పార్టీలో గ్రూపుల లొల్లి
పార్టీ మండల అధ్యక్షుడి వైఖరిపై కార్యకర్తల్లో అసంతృప్తి……
పొంగులేటి వైపు చూస్తున్న అసమ్మతి కార్యకర్తలు…..
మన్యం న్యూస్ చండ్రుగొండ ఫిబ్రవరి 19: మండల బీఆర్ఎస్ పార్టీలో గ్రూపులొల్లితో కార్యకర్తల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. పార్టీ మండల అధ్యక్షుడు ఒంటెద్దుపోకడ పోతున్నారని కార్యకర్తలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. గతంలో అధ్యక్షుడితో టీడీపీలో పని చేసిన వారికి ప్రాధ్యాన్యత ఇస్తూ బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులు, పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను పార్టీ మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిలు వేరు వేరుగా కేక్ లు కట్ చేశారు. ప్రధానంగా ఇటీవల మండలానికి మంజూరైన సీసీ రోడ్లు, దళితబంధు పథకాల పంపకాలలో అధ్యక్షుడు ఏకపక్షంగా వ్యవహరించి సీనియర్ లీడర్లకు, పలువురు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వలేదనే కారణంతో ఆయన వైఖరిని తప్పుపట్టి గ్రూపుల బలోపేతానికి దారి తీసింది. ఇటీవల పార్టీ మండల కమిటీ పంచాయితీ ఎమ్మెల్యే దృష్టికి పలువురు కార్యకర్తలు తీసుకెళ్ళారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇరువర్గీయులను పిలిచి మాట్లాడినట్లు కార్యకర్తలు తెలిపారు. ఎమ్మెల్యే సమక్షంలోనే ఇరువర్గీయులు బాహా బాహీగా వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ పంచాయితీ ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారింది. ఆ సమయంలోనే అభివృద్ధి కార్యక్రమాల మంజూరులో తుది నిర్ణయం తీసుకునేందుకు అడహక్ కమిటీ వేసినట్లు కార్యకర్తలు బహిరంగంగా అంటున్నారు. ఇటీవల మండల పరిషత్ సమావేశంలో ఎంపీపీ పార్వతి మండలానికి మంజూరైన సీసీ రోడ్లు, దళితబంధు పథకాల సమాచారం ఇవ్వలేదని ఆఫీసర్ల సాక్షిగా ఎంపీటీసీ హోదాలో డయాస్ పై కూర్చున్న పార్టీ మండల అధ్యక్షుడు దారా వెంకటేశ్వరావు (బాబు) ని నేరుగా నిలదీసిన సంఘటనలు ఉన్నాయి. ఆ కారణంతోనే వైస్ ఎంపీపీ, సొసైటీ చైర్మన్, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్ లు, జిల్లా రైతు బంధు సమితి కన్వినర్, పార్టీ మాజీ అధ్యక్షుడు, 14 పంచాయితీలోని బీఆర్ ఎస్ అసమ్మతి కార్యకర్తలతో పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ఎంపీపీ పార్వతి తెలిపారు.
మండలంలో పార్టీని బ్రష్టుపట్టిస్తున్నారని అసమ్మతి కార్యకర్తలు, సీనియర్ నేతలు పొంగులేటి నాయకత్వంలో పని చేసేందుకు ప్రత్యేక సమావేశం పెట్టి తీర్మానం చేశారు. పార్టీ మండల నాయకత్వం మార్పు చేస్తేనే మండలంలో పార్టీకి పుట్టగతులు | ఉంటాయని పలువురు కార్యకర్తలు అభిప్రాయ పడ్తున్నారు.