మన్యం న్యూస్, దమ్మపేట, మే, 05: మండల పరిధిలోని లచ్చాపురం గ్రామంలో ఆదివాసి నాయక ఫోడ్ తెగవారు నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర శుక్రవారంతో ముగిసింది. ఆదివారం ప్రారంభమైన జాతర ఐదు రోజులపాటు స్వామివారికి నిత్యం పూజలు సేవా కార్యక్రమాలు జరిగాయి. నిప్పుల గుండాల్లో నడిచే కార్యక్రమం శుక్రవారం రోజు జరిగింది. స్వామి వారు ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలో ప్రతి గడపకు తిరిగి గుడి వద్దకు చేరుకున్నారు. గురువారం తెచ్చిన సండ్ర చెట్లను నరికి మంట పెట్టి రవ్వలుగా మార్చి ఆ నుప్పుల గుండంలో స్వామి వారితో పాటు భక్తులందరూ నడిచారు. అనంతరం సన్నాయి మంగళ వాయిద్యాలు డోలుచప్పులకు గణాచారులు, ఉత్సాహమైన యువకులు నృత్యాలు చేశారు. అనంతరం వరదాడు దెబ్బలు గణాచారుల ద్వారా కొట్టించుకున్నారు. ఇలా చేయడం వల్ల ఒంట్లో ఉన్న గాలి ధూళి పోతాయని నమ్ముతారు. అనంతరం గంధం పళ్ళు కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. స్వామివారి గుడి వద్ద భోజనాలు ఏర్పాటు చేసుకొని సమూహంగా కూర్చుని భోజనాలు చేసారు. ఈ కార్యక్రమంలో చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు పలువురు పాల్గొన్నారు.