- ఆ 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దు
- అడ్డుకోలేని గిరిజన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
- ఆదివాసి గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్
మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11 బీసీ కులాలను షెడ్యూలు తెగలు ఎస్టీ జాబితాలో కలిపే అసెంబ్లీ తీర్మానం రద్దు చేయాలని, లేదా 12 మంది గిరిజన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అశ్వారావుపేట ఆదివాసి గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట ఆదివాసి గిరిజన సంఘం నాయకులు పాయం దుర్గారావు మాట్లాడుతూ భారతదేశ మూలవాసులైన ఆదివాసులు సాంస్కృతి సంప్రదాయాలను చరిత్రను కాపాడుతున్న ఆదివాసి సమాజ మనుగడను దెబ్బతీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల జనాభా కలిగిన 11 బీసీ కులాలైన వాల్మీకి, బోయ, కైత లంబాడా, పెద్ద బోయ, బెధర, కేరతక, నీ సారి, తలయారి, చుండు, వాళ్లు, బాగ్ మధుర, చామర్ అను బిసి ఎస్సి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరి లో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, కొన్ని బీసీ కులాలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నాయని ఎస్టీ జాబితాలో చేర్చలేదని, కేంద్ర ప్రభుత్వం నియమించిన సంచార కమిటీ తన నివేదికలో పేర్కొన్నదని, గిరిజనులపై అత్యంత లోతుగా అధ్యయనం చేసిన హైమన్ డార్ఫ్ అదే అభిప్రాయాన్ని తెలియజేశారని, 30 లక్షల జనాభా కలిగిన బీసీలను ఎస్టీ జాబితాలో చేర్చడం వలన విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్లకు దూరమై సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం కనుమరుగై అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆదివాసీల మనుగడ లేకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా అసెంబ్లీ తీర్మానం చేస్తే 12 మంది గిరిజన ఎమ్మెల్యేలు నోరు మెదపకుండా మౌనంగా ఎందుకు ఉండిపోయారని వారు ప్రశ్నించారు. ఆదివాసి గిరిజన సమాజాన్ని రక్షించాలంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని, లేదా సాధ్యం కాకపోతే ఆదివాసీ గిరిజనులపై చిత్తశుద్ధి ఉంటే రాజకీయ రిజర్వేషన్లు అనుభవిస్తున్న 12 మంది గిరిజన ఎమ్మెల్యేలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని తెలంగాణ ఆదివాసి జేఏసీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఊకే ముత్తయ్య, సోడెం ధర్మరాజు, జెట్టి లక్ష్మణరావు, విజయ్ కుమార్, కొవాసి స్వామి, పూనెం వెంకటస్వామి, సూర్యనారాయణ రావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, ప్రవీణ్, రమేష్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.