కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన విషయం మనకు తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో కూడా తన పార్టీ పట్టును పెంచుకునే ఉద్దేశంతో ఆయన రాజకీయ అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే ముందుగా ఆంధ్రప్రదేశ్ లో తన హవాను మొదలు పెట్టేశారు ఆయన. రీసెంట్ గానే ఏపీలో భారీ సభ పెట్టేసిన కేసీఆర్.. ఏపీ బీఆర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. అదే సమయంలో ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్థసారథి లాంటి కీలక నాయకులను కూడా పార్టీలో చేర్చుకున్నారు. వారితో పాటు మరికొందరు నాయకులు కూడా పార్టీలో చేరారు. అయితే ఏపీలో పార్టీ అయితే పెట్టారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి యాక్టివిటీస్ చేయలేదు.
కానీ సంక్రాంతి సందర్భంగా బరిలోకి దిగినట్టు కనిపిస్తోంది. ఈ జిల్లాలపై ఫోకస్.. పండుగ వేళ విషెస్ చెప్పి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ బీఆర్ ఎస్ నేతలు. ఇందులో భాగంగానే ఏపీలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఉన్న జాతీయ రహదారులు, ప్రధాన సర్కిళ్లలో పెద్ద ఎత్తున కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ , కేటీఆర్ ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలతో సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఫ్లెక్సీలను చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. ఈ విధంగా అయినా తమ పార్టీ గురించి, కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి ఏపీ ప్రజల్లో చర్చ జరగాలదన్నది బీఆర్ ఎస్ ఆలోచన. చూడాలి మరి వారి ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో.