- పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ…
- -రాహుల్ గాంధీ పై అనర్హత వేటు బీజేపీ నియంతృత్వానికి, అణచివేతకు నిదర్శనం.
- -ఎమర్జెన్సీ ని తలపిస్తున్న బీజేపీ పాలన.
- -ప్రశ్నించే గొంతులపై బీజేపీ ఉక్కుపాదం.
- – పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.
మన్యం న్యూస్, మణుగూరు, మార్చి24: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పై అనర్హత వేటు వేయడం బీజేపీ నియంతృత్వానికి, అణచివేతకు నిదర్శనమని, ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే నని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శుక్రవారం తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామిక పార్లమెంట్ వ్యవస్థలో ఈ రోజు చీకటి రోజని, పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యం ను బీజేపీ ఖూనీ చేసిందన్నారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడవడమేనన్నారు. పరువునష్టం కేసులో వేసిన శిక్షకే అనర్హత వేటు వేస్తే క్రిమినల్ కేసులలో శిక్షలు పడ్డ బీజేపీ ఎంపీలు వున్నారని, మరి వాళ్ళ సంగతేంటన్నారు. వారిపై ఇప్పటిదాకా ఎందుకు అనర్హత వేటు వేయలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాలను అణిచివేయడమే లక్ష్యంగా బీజేపీ పాలన సాగుతుందని, దేశాన్ని దోచుకునే దొంగల కోసమే బీజేపీ పని చేస్తుందన్నారు. బీజేపీ ని వ్యతిరేకించిన ప్రతిపక్షాలపై ఐటీ, ఈడి, సీబీఐ దాడులు చేయిస్తున్నారని, బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందన్నారు. ఇలాంటి చర్యలను ప్రజాస్వామిక వాదులు, ప్రజలు ఖండించాలని, బీజేపీ కి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.