- అంధకార సమాజానికి వెలుగుదారి జ్యోతిరావ్ పూలే
- సామాజిక అణచివేతలపై పూలే పోరాటాలు ఆదర్శం
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
- సిపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
సమాజంలో కొనసాగుతున్న వివక్షతకు, అణచివేతలకు గురవుతూ అంధకారంలో మగ్గుతున్న పీడిత కులాలకు, మహిళలకు వెలుగుదారి చూపిన మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరావ్ పూలే అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సాంఘిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావ్ పూలే 197వ జయంతిని మంగళవారం సిపిఐ జిల్లా కార్యాలయం, శేషగిరిభవన్ లో ఘనంగా నిర్వహించారు. తొలుత పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో అక్షరాస్యత కేవలం 11 శాతమేనని, సమాజంలో 89శాతం మందిని చదువుకు దూరం పెట్టిన పరిస్థితిలో ప్రధానంగా దళిత, బహుజన, మహిళలను చదువుకు దూరంగా పెట్టిన పరిస్థితిలో జ్యోతిరావు పూలే వారిలో జ్ఞాన కాంతులు వెలిగించారని కొనియాడారు. కులం పేరిట, ధర్మం పేరిట ప్రజలను అజ్ఞానంలో ఉంచేందుకు చేసిన కుట్రలను తిప్పి కొడుతూ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పూలే తన జీవితాన్నే అంకితం చేశారని అన్నారు. దళిత, బహుజన, స్త్రీల చదువుకోసం 1848లోనే తన సహచరి సావిత్రి బాయ్ పూలే, ఫాతిమా షేక్ సహకారంతో భారత దేశంలో తొలి పాఠశాలను స్థాపించాడని, గ్రామాల్లో ఆర్ధిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాడని, బాల్యవివాహాల రద్దు, వితంతు స్త్రీల పునర్ వివాహం కోసం కృషి చేసి వారికి మెరుగైన జీవితం అందించారని కొనియాడారు. స్వేచ్చా, సమానత్వం, సంక్షేమం, అందరూ ఆనందంగా బ్రతకాలన్న లక్షల్ని తన జీవితంలో భాగం చేసుకొని జీవితాన్ని సార్ధకత చేసుకున్న పూలే నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఆశించిన లక్షలను నెరవేర్చేందుకు కమ్యూనిస్టు కార్యకర్తలు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, కె.రత్నకుమారి, భూక్యా శ్రీనివాస్, నాయకులు భాగం మహేశ్వరరావు, నాగయ్య, చింతల రాజు, సోమయ్య, విజయలక్ష్మి, కారం రమేష్ తదితరులు పాల్గొన్నారు.