*మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:వేసవికాలంలో ఇల్లందు పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి సమస్య రాకుండా ఉండేందుకు ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ సూచన మేరకు ప్రతిరోజూ నీళ్లు ఇచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, సంబంధిత అంశాలపై ఇంజనీరింగ్ సెక్షన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో ఇల్లందు పురపాలక ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ అంకుషావలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వేసవి కాలంలో నీటి సమస్య రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. అదేవిధంగా నల్లా బిల్లులు కూడా ఆన్లైన్లోనే కట్టించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ అంకు షావలి మాట్లాడుతూ ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంపు బిల్లులు ఆన్లైన్ ద్వారానే కట్టించేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి సర్వే నిర్వహిస్తారని వారికి పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు. సర్వేకి వెళ్లే అధికారులు పనిలో అలసత్వం వహించకూడదని పట్టణ ప్రజలకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపాలిటీ ఏఈ శంకర్, ఆర్ఐ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.