UPDATES  

 ఉద్యమగాయకుడు సాయిచంద్ హఠాన్మరణం

ఉద్యమగాయకుడు సాయిచంద్ హఠాన్మరణం

కన్నీటిపర్యంతమైన సీఎం కేసీఆర్

భౌతికకాయాన్ని సందర్శించిన మంత్రులు కేటీఆర్, హరీష్, బిఆర్ఎస్ నేతలు

హైదరాబాద్ : తెలంగాణ గాయకుడు, ఉద్యమకారుడు, తెలంగాణ వేర్ హౌజ్ కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో హఠాన్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని ప్రముఖ రాజకీయ నేతలంతా సందర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి నేరుగా సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. సాయిచంద్ భౌతిక కాయాన్ని చూసి సీఎం కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్, హరీష్‌రావులు సైతం సాయిచంద్‌ భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్‌కి సాయిచంద్ వచ్చారు. అర్ధరాత్రి అస్వస్థతకు గురైన సాయిచంద్‌ని కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నాగర్ కర్నూల్ గాయత్రి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాతి బొమ్మలలోనా పాటతో ఉద్యమంలో ప్రతి ఒక్కరినీ సాయిచంద్ కంటతడి పెట్టించారు. సాయి చంద్ పాట లేని బీఆరెస్ సభ లేదంటే అతిశయోక్తి కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సభ ఉంది అంటే సాయి చంద్ ఉండాల్సిందేనన్నారు. సాయి చంద్ పాటల కోసం మంత్రులు, నేతలు పోటీ పడే వారు. ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌ అంటే సాయి చంద్‌కు చాలా అభిమానం. అయినా కేసీఆర్‌ను సాయిచంద్ ఎన్నడూ వీడలేదు.

కేటీఆర్ సంతాపం..

తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సాయి చంద్ మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా బీఆర్ఎస్‌కు తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం తీరని లోటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !