మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 9
గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునే తుది గడువును ఆగస్టు 31 దాకా పొడిగించాలని సిపిఎం మండల కార్యదర్శి కోడిశాల.రాములు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎంపీడీవో చంద్రమౌళి కి వినతి పత్రం సమర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ,కేవలం ఒకరోజు గడువు ఉండడం వల్ల ఎక్కువ మంది పేదలు అవకాశాన్ని కోల్పోతారన్నారు. వ్యవసాయ సీజన్ కావడం వలన ప్రజలకు పూర్తిగా సమాచారం తెలియదన్నారు. ప్రభుత్వం చెప్పినట్లు దరఖాస్తు కు కావలసిన గుర్తింపు కార్డులన్ని సమర్పించాలంటే సాధ్యం కాదన్నారు.మహిళా పేరుతో స్థలం ఉంటేనే పథకం వస్తుందని నిబంధన సరికాదన్నారు.అర్హులైన పేదలకు స్థలం ఎవరి పేరుతో ఉన్న పథకాన్ని వర్తింపచేయాలని,లేదంటే భర్త పేరుతో ఉన్న స్థలాన్ని భార్య పేరుతో మార్చుకునే అవకాశం అయినా ఇవ్వాలన్నారు. ఆదాయ,కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటానికి తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో లెనిన్ బాబు, మడి నరసింహారావు,నందం ఈశ్వరరావు,గుర్రం నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.