మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం జరిగే కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో జిల్లా ఎస్పీ డా.వినీత్.జి అన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం సభలు సమావేశాలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత ఉంటుందని అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన పాల్వంచ అనుబోస్ కళాశాల పరిసర ప్రాంతాలను డాగ్స్ స్క్వాడ్ బాంబుస్క్వాడ్ తో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఏజెంట్లు లెక్కింపునకు హాజరు అయ్యే అధికారులు నిషేధిత వస్తువుల అయిన అగ్గిపెట్టెలు, లైటర్, ఇంక్ బాటల్స్, పేలుడుకు కారణమయ్యే ఎలాంటి వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని తెలిపారు. తనిఖీలు చేసే పోలీసుసిబ్బందికి సహకరించాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుంది అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు.