మన్యం న్యూస్ వాజేడు
ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతం లో పెసా గ్రామ సభల ద్వారానే అభివృద్ధి జరగాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది వాసం నాగరాజు అన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టే ఆరు గ్యారంటీల విషయం లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పెసా గ్రామ సభల ద్వారానే జరగాలని ఆయన పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు పెసా చట్టం పైన సంపూర్ణ అవగాహన కలిగి వుండలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీల పథకాలు ఏజెన్సీ చట్టాలకు విరుద్దంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఏజెన్సీ ప్రాంతాలలో ప్రభుత్వ పరిపాలన రాజ్యాంగ బద్దంగా జరగడంలేదని వాపోయారు.రాష్ట్ర ప్రభుత్వం రూపొందిచించే సంక్షేమ పథకాలు ఏజెన్సీ ప్రాంత చట్టాలకు లోబడి ఉండాలన్నరు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నుండి గతంలో గిరిజనేతరుడు ఇంటి పన్ను ఇవ్వాలని హై కోర్ట్ ను ఆశ్రయించగా అప్పటి హై కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి నవీన్ రావ్ షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతరులకు ఇంటి పన్నులు ఇవ్వరాదని వ్యాఖ్యానించినట్లు గుర్తు చేసారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన గృహ లక్ష్మి పథకం ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘించే విధంగా ఉందని తెలంగాణ న్యాయస్థానం నిలుపుదల చేసినట్టు ఆయన తెలియజేశారు. కేసు నెంబర్ 29444/ 2023 అన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో పంచాయితీ అధికారులు సాధారణ గ్రామ సభలను నిర్వహించడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఏజెన్సీ చట్టాలను నిర్వీర్యం చేసినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి సంక్షేమ పథకం పైన గిరిజన సలహా మండలి లో ముందుగా చర్చ జరగాలని తెలిపారు. గిరిజన సలహా మండలి ఆదేశాల ప్రకారమే గిరిజన ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. గిరిజన సలహా మండలి ని సత్వరమే ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో అట్టం లక్ష్మయ్య, శివ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.