బీఆర్ఎస్ ఎమెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న వారు కరెంటు బిల్లు కట్టొద్దని ప్రజలకు సూచించారు. గృహజ్యోతి పతకంలో భాగంగా 200 యూనిట్లలోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని ఆమె గుర్తు చేశారు. నిజామాబాద్ రూరల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.
సంక్షేమ పథకాలు అందాలంటే దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారన్న కవిత.. ఈ క్రమంలో రెండు మూడు అంశాలపై ప్రజలకు సందేహాలున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయన్నారు. వారికి ఎటువంటి దరఖాస్తు అవసరం లేకుండా రూ. 2 వేల పింఛనును రూ. 4వేలకు పెంచే అవకాశం ఉన్నప్పటికీ మళ్లీ ఎందుకు దరఖాస్తులు కోరుతున్నారు.
ఆ 44 లక్షల మందికి జనవరి 1 నుంచి రూ. 4వేల పింఛను ఇవ్వాలన్నారు కవిత. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులకే పథకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాత పథకాలను వర్తింపజేస్తే అందరికీ పెద్ద ఎత్తున మేలు జరుగుతుందన్నారు. వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారని కవిత చెప్పారు.
రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో ఇంకా ఎందుకు జమ చేయలేదని గ్రామాల్లో చర్చ జరుగుతోందన్నారు కవిత. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. రూ. 4వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. దానికి ఎందుకు దరఖాస్తులు స్వీకరించడం లేదని ప్రశ్నించారు. ఓట్ల శాతంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడా లేదని ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యానించారు. కేవలం 2 శాతం ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు.