కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ బుధవారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా రైతుల ఇబ్బందులను ప్రస్తావించారు. విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు ?? అంటూ కాంగ్రెస్ సర్కారును నిలదీశారు.
‘పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ??’ అంటూ కేటీఆర్ ప్రశ్నలు మొదలు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప..ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ?? అని మండిపడ్డారు. నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..! నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు..!! అంటూ రేవంత్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు కేటీఆర్.
‘పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి.. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి ?? సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు.. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా ?? తెల్లవారుజామున 4 గంటలకు లైన్ లో నిలబడితే.. సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా ??’ అని కాంగ్రెస్ సర్కారును కేటీఆర్ ప్రశ్నించారు.
‘గత పదేళ్లపాటు.. 10 నిమిషాల్లో అందిన విత్తనాలు.. 10 గంటలపాటు పడిగాపులు పడినా అందించలేరా ?? రంగారెడ్డి నుంచి.. కామారెడ్డి దాకా.. రైతులకు ఏమిటీ కష్టాలు.. ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లు.. దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా ??’ అని కేటీఆర్ మండిపడ్డారు.
‘బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా ?? ఇప్పటికైనా.. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి..! బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కళ్లెం వేయండి..!! కాంగ్రెస్ వచ్చింది.. కాటగలిసినం అంటున్న.. అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండి..!! లేకపోతే.. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని.. కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదు..!!’ అని కేటీఆర్ హెచ్చరించారు.





