తమకు నచ్చని నేతలు బహిరంగ సభల్లో మాట్లాడుతూంటే.. వారిపైకి టమాటాలు, కాగితాలు విసరడం లాంటి సన్నివేశాలు సినిమాల్లో సాధారణంగా మనకు కనిపిస్తాయి. ప్రజాస్వామ్యంలో ఇదో రకమైన నిరసన. ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రజల వ్యతిరేకత, నిరసన బయటకు కనిపించకుండా పోలీసులతో అణచివేస్తున్నాయి. నిరసనకారులను ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తున్నాయి. అదే సమయంలో సభల్లో జనం కనిపించాలి కాబట్టి.. డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకుని సక్సెస్ అయినట్లు చూపుతున్నాయి. కానీ, ఇలా బలవంతంగా వచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులు.. నేతల ఊకదంపుడు ప్రసంగాలు వినలేకపోతున్నారు. టమాటాలు, కాగితాలు విసిరే అవకాశం లేకపోవంతో తమకు నచ్చని ప్రసంగం వినలేక సభల నుంచి వెళ్లిపోతున్నారు. CM Jagan ఏపీలో వైసీపీ సభల్లో ఉండని జనం.. ఏపీలో అధికార వైసీపీ పార్టీ సభల్లో మధ్యలోనే పార్టీ నేతలు, జనం వెళ్లిపోవడం ఇస్పుడు సాధారణమైంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇటీవల వివిధ కార్యక్రమాలపేరుతో బహిరంగా సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలోజయహో బీసీ మహాసభ నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్న సమయంలో సభా ప్రాంగణం సగం ఖాళీ అయింది. ఆపేందుకు పోలీసుల, నాయకుల యత్నం.. ఒకవైపు జగన్ ప్రసంగం సాగుతుండగానే.. కుర్చీలలో నుంచి లేచి జనం భారీగా బయటకు వెళ్లిపోతుండడంతో వారిని ఆపేందుకు పోలీసులు, వైకాపా నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. ఇందిరాగాంధీ మైదానానికి అన్నివైపులా ఉన్న దారులను బారికేడ్లు, తాళ్లతో మూసేసి.. జనాన్ని లోపలే ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ఉదయం 8 గంటల నుంచి సభా ప్రాంగణానికి భారీగా వైకాపా శ్రేణులు, జనాన్ని తరలించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సుల్లో సభ కోసం జనాన్ని తీసుకొచ్చారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం 12 తర్వాత సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభించిన సమయంలో ప్రాంగణంలో భారీగానే జనం ఉన్నారు. అరగంట తర్వాత.. సగం కుర్చీలు ఖాళీ అయిపోయాయి. భోజనశాలల వద్ద తోపులాట సభకు వచ్చినవారి కోసం వైసీపీ నేతలు మాంసాహార, శాకాహార భోజనాలు సిద్ధం చేశారు. సభా ప్రాంగణానికి మూడువైపులా భోజనశాలలు ఏర్పాటు చేశారు. మటన్ బిర్యానీ, చికెన్, చేపల పులుసు, ్రైఫై , రొయ్యలు, కోడిగుడ్లు, వెజ్ బిర్యానీ, పన్నీరు గ్రీన్పీస్.. ఇలా పెద్ద మెనూనే సిద్ధం చేశారు. ఉదయం 10 గంటలకే ఆహారం తీసుకొచ్చినా.. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ తినేందుకు అనుమతించలేదు. నాలుగైదు గంటలకు పైగా వేచి ఉన్నవారు భోజనశాలల వద్దకు మధ్యాహ్నం 12 గంటల నుంచి రావడం ఆరంభించారు. కానీ.. సీఎం ప్రసంగం పూర్తయ్యేవరకూ అనుమతించేది లేదని చెప్పడంతో.. సభకు వచ్చిన జనం తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు 1.30 తర్వాత లోపలికి అనుమతించారు. దీంతో అప్పటికే స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయినవాళ్లు భోజనాల కోసం మళ్లీ రావడానికి ప్రయత్నించగా.. పోలీసులు గేట్లు మూసేసి ఆపేశారు.