ఆపన్నులకు ఆసారాగా నిలుస్తూ.. అసహాయలకు భరోసానిస్తూ.. అభివృద్ధికి ఊతంగా నిలబడుతోంది ‘తానా’. తానా సభ్యులు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవలు చాలా మంది జీవితాలు వెలుగులు పంచుతుకున్నాయి. తాజాగా ఎన్నారై ఠాగూర్ మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరు తానా కార్యక్రమం సక్సెస్ అయ్యింది. ‘తానా చైతన్య స్రవంతి’ పేరిట అసహాయులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ.. పేదలకు చేయూత నిస్తూ విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ .. రెక్కాడితే డొక్కాడని వారికి ఉపాధి కల్పిస్తూ తానా సభ్యుల సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే విజయవాడ పరిధిలో చేసిన సేవా కార్యక్రమాలకు తానా సభ్యులపై ప్రశంసలు కురిశాయి. వీరి చేయూతను అందరూ వేయినోళ్ల కొనియాడారు. తాజాగా పెనమలూరులోనూ వీరి సేవా దక్షతను అందరూ మెచ్చుకున్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ తరపున తానా మీడియా కో ఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని పెనమలూరులో నిర్వహించిన ‘తానా చైతన్యస్రవంతి’ కార్యక్రమం విజయవంతమైంది. జడ్పీ హైస్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు తానా నాయకులతోపాటు, ఏరియా ప్రముఖులు, జడ్పీ హైస్కూల్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేయూత కార్యక్రమం కింద పేద విద్యార్థులకు దాదాపు లక్ష రూపాయల విలువ చేసే స్కాలర్ షిప్లను పంపిణీ చేశారు. రైతు కోసం కార్యక్రమం కింద పేద రైతులకు పవర్ స్ప్రేయర్లు, రైతు రక్షణ పరికరాలను అందజేశారు. ఆదరణ కార్యక్రమం కింద మహిళలకు కుట్టుమిషన్లను, వికలాంగులకు ట్రై సైకిళ్ళను పంపిణీ చేశారు. క్యాన్సర్ పరీక్ష కేంద్రం ఏర్పాటుతోపాటు ఇఎన్టి, టాప్ స్టార్ హాస్పిటల్ వారితో ఉచిత వైద్యశిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు, పరీక్షలను చేశారు. జడ్పి హైస్కూల్కు కుట్టుమిషన్లను దివ్యంగులకు ట్రై సైకిల్స్ అందజేశారు. న్యూయార్క్ ఎన్నారై శ్రీనివాస నాదెళ్ళ పెనమలూరు జడ్ పి హైస్కూల్ పేద విద్యార్థి కి పది వేల రూపాయలు సహాయం చేసారు.