మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 21:పినపాక నియోజకవర్గం పరిధిలోని ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూములు కట్టించి ఇవ్వాలని, గోదావరి ముంపు బాధితులకు సురక్షిత ప్రాంతంలో శాశ్వత గృహ నిర్మాణాలను చేపట్టాలని కోరుతూ శనివారం పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తన క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం అంద చేశారు.
గత ఏడాది జూలై 17న ముఖ్యమంత్రి కెసిఆర్ భద్రాచలం వచ్చి గోదావరి ముంపు బాధితులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు. ఆదివాసీలకు, దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి హామీని కూడా నెరవేర్చాలని కోరారు. 160 రోజులుగా బూర్గంపాడు మండలంలోని మణుగూరు సారపాక అడ్డరోడ్డులో నిరసన దీక్ష చేపడుతున్న పేద ప్రజలకు ఇండ్ల స్థలాల కోసం తక్షణమే భూమి కేటాయించాలని ఈ వినతి పత్రంలో కోరారు. ఆదివాసీలపై ఫారెస్ట్ శాఖ అధికారులు చేస్తున్న దాడులను వెంటనే అరికట్టాలని కోరారు. శాసనసభ్యులుగా ఆదివాసీ దళిత ఇతర పేదల ఇళ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిందిగా కోరారు. అనంతరం ఎం ఎల్ ఏ రేగా కాంతారావు సానుకూలంగా స్పందిస్తూ ఈ సమస్యను పరిస్కారం దిశగా కృషి చేస్తానని అన్నారు. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మణుగూరు భద్రాచలం సబ్ డివిజన్ నాయకురాలు పెద్దగోని ఆదిలక్ష్మి, ఇళ్ల స్థలాల సాధన పోరాట కమిటీ నాయకులు సున్నం భూలక్ష్మి, బండ్ల మునెమ్మ, గజ్జల అలివేలు, ప్రశాంత్ ,ముత్యాల సత్యనారాయణ, గలిగే నరసమ్మ , ఇరుప లక్ష్మి , బట్టు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
