మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 28.. పోలీస్ శాఖలో ఆర్మీ రిజర్వ్ విభాగం పాత్ర చాలా కీలకమైందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురం నందు డీ-మొబిలైజేషన్ పెరేడ్ నందు ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన మాట్లాడారు పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురం నందు జిల్లా సాయుధ దళ విభాగంలో జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల విధులు నిర్వర్తించే ఏఆర్ అధికారులు,సిబ్బందికి గత 15 రోజులుగా మొబిలైజేషన్లో భాగంగా వారి విధులలో మరలా తిరిగి శిక్షణను పొందడం జరిగింది.ముగింపు కార్యక్రమం అయిన డీ-మొబిలైజేషన్ కు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు ఆధ్వర్యంలో ప్రణాళిక ప్రకారం ఈ డీ-మొబిలైజేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది.ముందుగా ఎస్పీ జిల్లా సాయుధ బలగాల విభాగం తరపున పరేడ్ కమాండర్ ఆర్ఐ దామోదర్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం 04 ప్లాటున్స్ ద్వారా జరిగిన మొబిలైజేషన్ పరేడ్ ను ఎస్పీ వీక్షించారు.తరువాత జిల్లా డాగ్ స్క్వాడ్ నందు పని చేస్తున్న జాగిలాల ప్రతిభను ప్రదర్శించారు.స్క్వాడ్ డ్రిల్,లాఠీ డ్రిల్,మాబ్ ఆపరేషన్ తదితర అంశాలపై ఏఆర్ సిబ్బంది తమ విధుల తీరును వ్యక్తపరుస్తూ గత 15 రోజులుగా వారు తీసుకున్న శిక్షణను ప్రదర్శించారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఏఆర్ విభాగం యొక్క పాత్ర చాలా కీలకమని అన్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పరోక్షంగా,ప్రత్యక్షంగా ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలియజేశారు.జిల్లాలో వివిధ రకాల విధులను నిర్వర్తిస్తూ,సంవత్సరంలో ఒకసారి అందరూ కలిసి అట్టి విదులలో తమ అనుభవాలను పంచుకుంటూ క్రమశిక్షణతో ముందుకెళ్లడానికి ఈ మొబలైజేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.నిరంతరం ప్రజాసేవలో ప్రత్యక్షంగా,పరోక్షంగా పోలీస్ శాఖలో విధులను నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం జిల్లా సాయుధ విభాగంలోని పోలీస్ అధికారులు,సిబ్బందితో సమావేశమయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వీలైనంత త్వరలో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసారు.
