పేదోడి సొంతిటి కలను నెరవేర్చండి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లా…రూ. 3లక్షల పథకమా తేల్చండి
దరఖాస్తుదారులందకి గృహవసతి కల్పించండి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
తహశల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సిపిఐ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం దిగ్భందం.. ధర్నా
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి 15.. పేద వర్గాల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వ చర్యలు వేగవంతం కావాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు, రూ.3లక్షల పథకం అమలు చేయాలని, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలను సరిచేసి నిజమైన పేదలకు న్యాయం చేయాలని, ఇండ్లకు అర్హత పొందిన వారికి గృహవసతి కల్పించాలని డిమాండ్ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం తహశీల్దార్ కార్యాలయం ప్రధాన ద్వారాన్ని మూసివేసి దిగ్భందించి ధర్నా నిర్వహించారు. పట్టణంలోని వివిధ బస్తీల నుంచి తరలివచ్చిన పేద వర్గాల నినాదాలతో కార్యాలయ ప్రాంతం మార్మోగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిదిగా హాజరైన కూనంనేని పేదలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతుందే తప్ప పేదల బ్రతుకుల్లో మార్పులు రావడం లేదని, ఎన్నో ఏండ్లుగా పేదలకు ఉండేందుకు గూడు కల్పించే విషయంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గృహకల్ప, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కాలం వెలోలదీస్తున్నారని ఆరోపించారు. పట్టణ పేదలకోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపనలు ఏండ్లు గడుస్తున్నా నిర్మాణాలు పూర్తి చేయకపోవడం పేదలపట్ల పాలకులకు ఉన్న నిర్లక్ష్యం స్పష్టమవుతోందన్నారు. జనాభా ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టకుండా అరకొర నిర్మాణం చేపట్టడం పేదలను మోసం చేయడమేనన్నారు. పాల్పంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలకు అధికార యంత్రాంగమే భాద్యత వహించాలని, తప్పులను సరిచేసి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్హత సాధించి డ్రాలో ఇండ్లు పొందని వారికి పాతకొత్తగూడెం, రామవరం, ప్యూన్ బస్తి తదితర ఏరియాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలు కేటాయించి ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల పథకాన్ని అమలు చేయాలని, రైల్వే నిర్వాసితులకు ప్రత్యామ్నాయ గృహ వసతి కల్పించి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఐదు దశాబ్దాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడిన వలస కుటుంబాలకు, ఇతర పేదలకు ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం తహశల్దార్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, జి.నగేష్, మునిగడప వెంకటేశ్వర్లు, కె.రత్నకుమారి, కౌన్సిలర్లు, నాయకులు మాచర్ల శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, నేరెళ్ళ శ్రీనివాస్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, గోనె సురేష్, పెయ్యాల రంగారావు, పాటి మోహన్, గుగులోత్ నగేష్, దాట్ల శ్రావణ్, వి. హరినాద్, గుత్తుల శ్రీనివాస్, షాహీన్, విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి,షమీమ్, అఖ్తర్, కాటూరి రాము, లింగేష్, కె. జోసఫ్, బాజోజు రవి తదితరులు పాల్గొన్నారు.





