మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి..
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిపట్టాలు జారీ చేస్తామని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు
తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో జిఓ 76పై సింగరేణి సంస్థ ప్రభుత్వానికి అప్పగించిన భూములకు ఇళ్ల స్థలాల పట్టాలు జారీ ప్రక్రియపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2019, 2022వ సంత్సరాలలో రెండు దశలుగా జిఓ 76 ప్రకారం సింగరేణి సంస్థ ప్రభుత్వానికి అప్పగించిన భూముల్లో నివాసాలు, వ్యాపార సముదాయాలు నిర్మించుకున్న వారికి క్రమబద్దీకరణ పట్టాలు జారీ చేసేందుకు ప్రభుత్వం అవకాశం
కల్పించినట్లు చెప్పారు. జూన్ 2, 2014 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుని అంతకుముందు ఇళ్లు, వ్యాపార
సముదాయాలు నిర్మించుకున్న వారికి క్రమబద్ధీకరణ పట్టాలు జారీ చేశామని చెప్పారు. వివిధ కారణాల వల్ల వాటిలో కొన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా అట్టి వారికి కూడా ఇంటి పట్టాలు జారీ చేయాలని, 2014 తరువాత ఇళ్లు
నిర్మించుకున్న వారికి పట్టాలు జారీ చేయుటకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ నెల 17వ తేదీన ప్రత్యేకంగా ప్రభుత్వం జిఓ నెం. 76 విడుదల చేసినట్లు చెప్పారు. ఈ జిఓ ప్రకారం జూన్ 2, 2014 నుండి జూన్
2, 2020వ తేదీ మద్యలో ఇళ్లు నిర్మించుకున్న వారికి కూడా క్రమబద్ధీకరణ పట్టాలు జారీ చేసేందుకు అవకాశంకల్పించినట్లు చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆన్లైన్ ద్వారా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయడానికి అవకాశంకల్పించినట్లు ఆయన అన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తులు చేయడానికి అవకాశం ఉందని,
ఈ మూడు నెలల తదుపరి దరఖాస్తు చేయడానికి అవకాశం లేదని చెప్పారు. క్రమబద్దీకరణకు ఇదే చివరి అవకాశమని అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు, విచారణ, క్రమబద్ధీకరణ పట్టాలు జారీ ప్రక్రియ పారదర్శకంగా
జరుగుతుందని, ప్రజలు దళారులను ఆశ్రయించొద్దని, ఏదేని సలహాలు, సందేహాలుంటే తహసిల్దారును, ఆర్డీఓను సంప్రదించాలని చెప్పారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిఓ నెం 76 ప్రకారం రెండు దశల్లో కొత్తగూడెంలో 8585 మంది, ఇల్లందులో 4666, చుంచుపల్లిలో 3, లక్ష్మీదేవిపల్లిలో 2,దమ్మపేటలో ఒక దరఖాస్తు మొత్తం 13257 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. విచారణ నిర్వహించిన అనంతరం
కొత్తగూడెంలో 5336, ఇల్లందులో 2507, మొత్తం 7843 మంది అర్హులను ఎంపిక చేసినట్లు చెప్పారు. కొత్తగూడెంలో 3249, ఇల్లందు 2159, చుంచుపల్లిలో 3, లక్ష్మీదేవిపల్లిలో 2, దమ్మపేటలో ఒక దరఖాస్తు మొత్తం 5414 తిరస్కరించినట్లు చెప్పారు. 6335 మంది లబ్దిదారులకు డిమాండ్ నోటీసులు జారీ చేశామని, వారటిలో 6187 మంది ప్రభుత్వ
మార్గదర్శకాల మేరకు 6 కోట్ల 53 లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమచేసినట్లు చెప్పారు. 876 దరఖాస్తులు
రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సిద్ధంగా ఉన్నాయని, 1047 పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని రానున్న 10 రోజుల్లో పంపిణీ
చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన జిఓ ప్రకారం అర్హులందరూ దరఖాస్తుచేసుకోవాలని అన్నారు. జూన్ 2, 2014 తదుపరి జూన్ 2, 2020 లోపు ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం
క్రమబద్దీకరణ పట్టాలు జారీ చేసేందుకు మూడు నెలల పాటు అవకాశం కల్పించినట్లు చెప్పారు. విచారణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రజల నుంచిఅభ్యంతరాలు స్వీకరణకు కొత్తగూడెం, ఇల్లందు తహసిల్దార్
కార్యాలయాలతో పాటు ఆర్డీఓ, కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే ప్రజలు మెసేజ్(సందేశాలు) ద్వారా పిర్యాదు చేయుటకు ప్రత్యేకంగా వాట్సప్ నెంబరు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.వచ్చిన పిర్యాదు ఆధారంగా విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని, పిర్యాదులు చేసిన వ్యక్తుల సమాచారం
గోప్యతగా ఉంచుతామన్నారు, ఎదైనా సమస్య ఉంటే నిర్భయంగా పిర్యాదు చేయవచ్చునని ఆయన చెప్పారు. ప్రభుత్వ భూముల్లో
ఇళ్లు నిర్మించుకున్న వారికి క్రమబద్దీకరణ పట్టాలు జారీ చేసేందుకు ప్రభుత్వం జిఓ 58, 59ను అందుబాటులోకి వచ్చిందన్నారు. జీవో నెంబర్ 28 ప్రకారం 100 గజాల లోపు ఉన్న ఇంటి స్థలాలకు ఉచితంగా క్రమబద్ధీకరణ పట్టాలను మంజూరు చేస్తామని 100 గజాలకు పైగా ఉన్న భూములకు నామమాత్ర పు రుసుం చెల్లించి పట్టాలు పొందవచ్చునన్నారు. పట్టాల విషయంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని సంబంధిత ప్రజా ప్రతినిధులు తమకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో అనురాధ, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీత లక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.