మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
జరగబోయే పదవ తరగతి పరీక్షలలో మెరుగైన ఫలితాలను సాధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆకాంక్షించారు.10 వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా కలెక్టర్ ప్రకటన జారీ చేశారు. సంవత్సర కాలం పాటు ఎంతో కృషి, పట్టుదలతో 10 తరగతి పరీక్షలకు సన్నద్ధమయ్యారని, విద్యార్థి దశకు ఎంతో కీలకమైనటువంటి పరీక్షకు హాజరవుతున్నందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఆశీర్వదించారు. ఎలాంటి వత్తిడి, ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవడానికి అదనపు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, విద్యార్థులతో పాటు పర్యవేక్షణ అధికారులకు కూడా అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ప్రశాంత వాతావరణం ఉండేవిధంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. అత్యవసర వైద్య కేంద్రాలు, సురక్షిత మంచినీరు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, మీరందరూ ఎలాంటి అక్రమాలకు, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా నిశ్చింతగా పరీక్షలు రాసి మంచి గ్రేడింగ్ తో ఉత్తీర్ణత సాధించి మన జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన అభిలషించారు.