మన్యంన్యూస్,ఇల్లందు టౌన్ ..తెలంగాణ
ప్రగతిశీల ఐఎఫ్టీయూ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతనకార్యవర్గం17 మందితో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐఎఫ్టీయూ భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి డి. ప్రసాద్ తెలిపారు. పట్టణంలోని సాహితీ డిగ్రీ కళాశాలలో వేముల గురునాధం అధ్యక్షతన సోమవారం జరిగిన ఈ సమావేశంలో మణుగూరుకు చెందిన మిట్టపల్లి రాజేందర్ ను మున్సిపల్ వర్కర్స్ యూనియన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షునిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా షేక్ యాకుబ్ షావలి, సహాయ కార్యదర్శిగా బత్తుల వెంకటేశ్వర్లు,కోశాధికారిగా మాట్ల శ్రీనులు ఎన్నికయ్యారు. ఇదేవిధంగా
12 మంది కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగినట్లు వేముల గురునాధం తెలిపారు. ఎన్నిక అనంతరం జరిగిన సభలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రామయ్య ఐదు తీర్మానాలను ప్రవేశపెట్టారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పట్టణ జనాభాకి అనుగుణంగా పనిభారం తగ్గించి కార్మికుల సంఖ్యను పెంచాలని, తడి, పొడి చెత్తలో పనిచేస్తున్న టాటా మ్యాజిక్ డ్రైవర్ల హెల్పర్లకు కనీస వేతనాల జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని, మున్సిపల్ కార్మికులకు ఇండ్ల స్థలాలతో పాటు స్థలాలు ఉన్నవారికి డబుల్ బెడ్రూంలు కట్టివ్వాలి అని తీర్మానించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సన్నద్ధం కావాలని జిల్లా మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర అధ్యక్షులు గురునాధం పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎన్నికైన మున్సిపల్ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ… తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, కార్మికుల పక్షాన ఎన్ని పోరాటాలకైన సిద్దమని పేర్కొన్నారు.
