- గ్రామీణ ఉపాధిహామీ, అటవీ హక్కుల చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి
- వ్యవసాయ రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధ్యాన్యత ఇవ్వాలి
- బికెఎంయు జిల్లా జిల్లా నేతలు రేసు ఎల్లయ్య, యార్లగడ్డ భాస్కర్ రావు
- జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా..వినతి అందించిన నేతల బృందం.
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
వ్యవసాయరంగ కార్మికుల సమగ్ర సంక్షేమ చట్టం అమలుకోసం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మూడు ఎకరాల భూ పంపిణీకోసం వ్యవసాయరంగ కార్మికులు ఉద్యమ బాట పట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం (బికెఎంయు) భద్రాద్రి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యార్లగడ్డ భాస్కర్ రావు, అధ్యక్షులు రేసు ఎల్లయ్య పిలుపునిచ్చారు. బికెఎంయు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా ఎల్లయ్య మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు, పేదలకు ఇచ్చిన హామీలు ఏండ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడంలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. బికెఎంయు దేశవ్యాప్తంగా చేసిన పోరాటాల ఫలితంగానే గ్రామీణ ఉపాదిహామీ పథకం, అటవీ హక్కుల చట్టం సాధించుకున్నామని అన్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న ఈ చట్టాల అమలులో ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ పేదలు అన్యాయానికి గురవుతున్నారన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. అనాదిగా గిరిజనులు, గిరిజనేతర పేదలు సాగుచేసుకుంటున్న పోడు రైతులపై ప్రభుత్వం కక్ష కట్టిందని, 2005 అటవీహక్కుల చట్టం ప్రకారం పోడుసాగుదారులకు పట్టాలు మంజూరు చేయాల్సిన ప్రభుత్వం పేదల సాగులో ఉన్న భూములను లాక్కుంటూ బ్రతుకు లాగేసుకుంటున్నారని విమర్శించారు. ఉపాధిహామీ పథకంలో 300రోజుల పనిదినాలు కల్పించి రోజుకు కనీసం రూ.500కూలీ చెల్లించాలని, సమగ్ర సంక్షేమ చట్టం తీసుకురావాలని, గ్రామీణ పేదలకు సామాజిక పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, స్వంత స్థలం వున్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు చెల్లించాలని, దళితులకు మూడు ఎకరాల భూమి వంటి హామీలు అమలు చేయాలని పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితిలో లేకపోవడం దుర్మార్గమైందన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు వీసంశెట్టి పూర్ణచందర్ రావు, వాగబోయిన రమేష్, వజ్జ పగడయ్య, ఇమ్మానియేలు, కత్తుల నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.