మన్యం న్యూస్ బూర్గంపాడు :
పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన దృష్ట్యా పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… సరదా కోసం మిత్రులతో కలిసి సమీపంలో ఉండే చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు పిల్లలను చూసుకోవాలన్నారు. విద్యార్థులు ఈతకు వెళ్లి చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. సరదాకు వెళ్లిన పిల్లలకు వాటి లోతు తెలియక ప్రమాదంగా మారే అవకాశం ఉందని, గతంలో ఎంతో మంది చనిపోయిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా ద్విచక్ర వాహనాలు, కార్లను నడిపేందుకు రోడ్డెక్కి ప్రమాదాల భారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని, ద్విచక్ర వాహనాలు, కార్లను మైనర్ పిల్లలకు ఇచ్చి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. మైనర్ బాలురు ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ పట్టుబడితే వాహన యజమానిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్సై హెచ్చరించారు.