- ఆపదలో అపర సంజీవిని.. రక్త నిధి కేంద్రాలు
- జిల్లా కలెక్టర్ అనుదీప్
- రూ.47 లక్షలతో జిల్లాలోనాలుగు రక్త నిధి కేంద్రాలు ఏర్పాటు ..
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నాలుగు బ్లడ్ స్టోరేజీ యూనిట్లు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. రక్త నిధి ,రక్త నిల్వ కేంద్రాలు ఏర్పాటుతో ప్రసవాలు, ఏదేని ప్రమాదాలు జరిగిన సందర్భంలోసికిల్ సెల్ ఎనీమియా, తలసేమియాతో బాధపడుతున్న వారికి రక్తం ఎక్కించాలంటే రక్త నిధి నిల్వ కేంద్రాలు లేక ప్రజలు ఇబ్బందులు పడే వారని, ఈ కేంద్రాలు ఏర్పాటుతో అన్ని రోజుల్లో ప్రజలకు రక్తం ఎక్కించడానికి రక్త నిల్వలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. మారుమూల ప్రాంతాలైన అశ్వారావుపేట, మణుగూరు, ఇల్లందు, పాల్వంచలకు బ్లడ్ స్టోరేజీ యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. రూ.47 లక్షల వ్యయంతో ఈ నాలుగు ప్రాంతాల్లో రక్త నిధి స్టోరేజీ యూనిట్లు, పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో కొత్తగా మణుగూరు, ఇల్లందు, అశ్వారావుపేటలకు బ్లడ్ స్టోరేజీ యూనిట్ ఏర్పాటు కోసం ఒక్కో యూనిట్ కు రూ 13 లక్షలు చొప్పున మొత్తం రూ .39 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. పాల్వంచలో ఇప్పటికే స్టోరేజీ యూనిట్ ఉండగా పరికరాలు ఏర్పాటు కోసం రూ.8 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి, గర్భిణిలకు ఈ స్టోరేజి యూనిట్లు సంజీవనిలా పని చేస్తాయని ఆయన తెలిపారు. గతంలో రక్తం ఎక్కించాలంటే కొత్తగూడెం, భద్రాచలం ఆసుపత్రిలలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండేవని, వీటి ఏర్పాటుతో స్థానికంగా రక్తం ఎక్కించుకోవడానికి ప్రజలకు సులువు అవుతుందని చెప్పారు. రక్త నిధి కేంద్రాలు ఏర్పాటు ద్వారా ప్రజలకు దూరా భారం తగ్గడంతో పాటు ఆపత్కాలంలో ఉన్నవాళ్లుకు తక్షణమే రక్తం అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇల్లందు, మణుగూరు, అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రులలో ఇప్పటికే ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసి సర్జరీలు ప్రారంభించినట్లు వివరించారు. ఆపరేషన్ సమయంలోను, యాక్సిడెంట్ కేసుల్లో అత్యవసర సమయాల్లో స్థానికంగానే ఈ స్టోరేజి కేంద్రాల్లో అన్ని రోజుల్లో రక్తం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రోగులు సుదూర ప్రాంతాలకు వెళ్లి రక్తం కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఈ సెంటర్ల ఏర్పాటుతో తొలగిపోనున్నాయని పేర్కొన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ సీఎస్ఆర్ నిధులు రూ. 20 లక్షలతో రక్తనిధి కేంద్రం నుంచి రక్తనిల్వ కేంద్రానికి తరలించడానికి ప్రత్యేక వాహనాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. గత ఆరు నెలలుగా బ్లడ్ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటుకు కృషి చేసిన ఆసుపత్రుల సమన్వయ అధికారి డా రవిబాబు ను కలెక్టర్ అభినందించారు.