ఆదివాసి అస్థిత్వానికి ఆర్ఎస్ఎస్ ముప్పు
– హిందుత్వ ఎజెండాతో ఆదివాసిల్లోకి విరుద్ధ భావాలు
– జనగణన సర్వేపత్రంలో ఆదివాసి పదం చేర్చాలి..
– మేడారం పూజల్లోనూ హిందూ సంప్రదాయానికి యత్నం
– సంఘం, సిద్ధాంతం, సంఘర్షణలతో విరుద్ధ భావాలను తిప్పికొట్టాలి
– తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం – టీఏజీఎస్ మూడో మహాసభల్లో ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకరత్
మన్యంన్యూస్, భద్రాచలం :
అస్థిత్వ రాజకీయాలు ఆర్ఎస్ఎస్ చేతిలో ఆయుధంగా మారా యని, హిందుత్వ ఎజెండాతో ఆదివాసిల్లోకి విరుద్ధ భావాలు చొప్పించి, ఆదివాసి అస్థిత్వానికి ఆర్ఎస్ఎస్ ముప్పుగా పరిణమించిందని ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకరత్ అన్నారు. శనివారం భద్రాచలం సమ్మక్క- సారలమ్మ ఫంక్షన్ హాల్ లోని ఏర్పాటు చేసిన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం – టీఏజీఎస్ మూడో మహాసభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… జనాభా కుల గణనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలకు మతంతో సంబంధం లేకుండా ప్రత్యేక కాలమ్ ను పునరుద్ధరించాలని కోరారు. ఆదివాసీల్లోకి ప్రవేశించిన విరుద్ధ భావాలను సంఘం, సిద్ధాంతం, సంఘర్షణలతో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. హిందుత్వ ఎజెండాతో ఆర్ఎస్ఎస్ విరుద్ధ భావాలను ఆదివాసీల్లో చొప్పించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం అత్యంత ప్రమాదకరమని, దీనిని పోరాటాలతోనే నియంత్రించాలని సూచించారు. అస్థిత్వ రాజకీయాలు ఆర్ఎస్ఎస్ చేతిలో ఆయుధంగా మారాయి అన్నారు. జార్ఖండ్లోని గిరిజనుల మధ్య విభేదాలు, మణిపూర్ లో గిరిజనులు, ఆదివాసీల మధ్య అనైక్యత, తెలంగాణలో లంబాడి, ఆదివాసీల మధ్య చిచ్చు పెడుతూ ఆర్ఎస్ఎస్ పబ్బం గడుపుతోందని విమర్శించారు. మేడారం సమ్మక్క, సారక్క జాతరలో ఆదివాసి సంప్రదాయాన్ని రూపుమాపి హిందూ ఆచార వ్యవహారాలను ముందుకు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఆదివాసీ సంస్కృతికి బదులు హనుమంతుడు, రాముడు, దుర్గ, గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తూ ఆదివాసీలను హిందూ మతారాధకులుగా మార్చే ప్రయత్నం కొనసాగుతోందన్నారు. జనగణన సర్వే పత్రంలో ఆదివాసి అనే పదం ఎక్కడా లేదని, జార్ఖండ్ ప్రభుత్వం గిరిజనులు అనే పదాన్ని చేర్చాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. జన గణనలో ఆదివాసి అనే పదం లేకుంటే హిందూ అనే కాలమ్ లోనే ఆదివాసీలు నమోదు అవుతారని, తద్వారా ఆదివాసీల మధ్య వైరుధ్యం పెంచి వారి ఉనికినే అత్యంత ప్రమాదంలోకి నెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. జనాభా సర్వే పట్టికలో ఆదివాసి అనే పదం చేర్చాలని డిమాండ్ చేశారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా టి ఏ జీ ఎస్ పోరాటం హర్షనీయమని పేర్కొన్నారు. ఆదివాసి అధికార మంచ్ కు 15 రాష్ట్రాల్లో అనుబంధ సంఘాలు ఉన్నట్లు చెప్పారు. మంచ్ ఆధ్వర్యంలో చల్లాచెదురుగా విభజించబడిన ఆదివాసీలను సంఘటితం చేసినట్లు తెలిపారు. మంచ్ కు అనుబంధంగా సీఏఆర్ డీ (కార్డ్) అనే సంస్థను నెలకొల్పి ఆదివాసి ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వర్గాల గిరిజన సమస్యలపై సర్వేలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర సంఘం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆశయాల కోసం అమరులైన వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలని.. అందుకు తాము తోడుంటామని హామీ ఇచ్చారు.
* విజయవంతంగా ముగిసిన సభలు
సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మీడియం బాబురావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ మహాసభలు శనివారం నాటితో విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల నుంచి 260 మంది ప్రతినిధులు మహాసభలకు హాజరయ్యారు. మహాసభల ప్రారంభానికి ముందు మిడియం బాబురావు ముందుగా టీఏజీఎస్ పతాకాన్ని ఆవిష్కరించి కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఆహ్వాన కమిటీ అధ్యక్షులు రవివర్మ కుంజా బొజ్జి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడసం భీమ్ రావు సున్నం రాజయ్య చిత్రపటానికి పూలమాలలు వేశారు. గత మహాసభ నుంచి నేటి వరకు మృతి చెందిన అమరవీరులకు మహాసభ సంతాపం ప్రకటించింది. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మధు ఈ మహాసభలకు సంఘీభావంగా మాట్లాడారు. అధ్యక్షవర్గం మిడియం బాబురావు, కూసం సచిన్, సున్నం గంగా, నాయకులు కారం పుల్లయ్య, పి సోమయ్య, వజ్జా సురేష్, నగేష్ తదితరులు మొత్తం 16 తీర్మానాలను మహాసభల్లో ప్రవేశపెట్టగా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సభల్లో బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, సరియం కోటేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, దుగ్గి కృష్ణ, దబ్బకట్ల లక్ష్మయ్య, ఊకే వీరస్వామి, మడివి రమేష్ తదితరులు పాల్గొన్నారు.