- కర్నాటకలో కాంగ్రెస్ హవా
- దక్షిణాది నుండి బిజెపి ఔట్
- అడ్రస్ గల్లంతుచేసిన కన్నడిగులు
- కాంగ్రెస్ విజయంపై దేశవ్యాప్తంగా హర్షం
కన్నడిగులు కాంగ్రెస్కు ఘన విజయాన్ని కట్టబెట్టారు. ‘40 శాతం కమిషన్’ ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ ప్రభుత్వాన్ని గట్టి దెబ్బ తీశారు. అధికార బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. దక్షిణాదిన ఆ పార్టీ అడ్రస్ గల్లంతయింది. కాంగ్రెస్ విజయయాత్రలో బీజేపీ, జేడీఎస్ కంచుకోటలు తునాతునకలయ్యాయి. బీజేపీ మంత్రుల్లో చాలా మంది పరాజితుల జాబితాలో చేరిపోయారు. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ అద్భుత విజయాలు నమోదు చేసుకున్నారు. 224 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 65, కాంగ్రెస్ 136, జేడీఎస్ 19, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తపూర్ నియోజకవర్గంలో విజయం సాధించారు. తాము కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వాన్ని ఇస్తామని ప్రియాంక్ చెప్పారు.